అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Constable pramod | రౌడీషీటర్ రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీత ఎన్కౌంటర్పై స్పందించింది. నిందితుడు రియాజ్కు సరైన శిక్ష పడిందని వ్యాఖ్యానించింది. హత్య జరిగిన రోజు సీసీఎస్ కార్యాలయం (CCS Office) నుంచి అర్జెంట్గా రావాలని ఫోన్ కాల్ రావడంతో ఆయన డ్యూటీకి వెళ్లాడని.. తిరిగి మృతదేహంగా ఇంటికి వచ్చాడని ఆమె కన్నీటి పర్యంతమైంది.
Constable pramod | సంచలనం సృష్టించిన హత్య ఘటన
కానిస్టేబుల్ ప్రమోద్ను రౌడీషీటర్ రియాజ్ మూడురోజుల క్రితం నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై హత్య చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు రియాజ్ శనివారం సాయంత్రం నగర శివారులోని సారంగపూర్ (Sarangapur) ప్రాంతంలో ఉండగా ఓ వ్యక్తి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ పెనుగులాటలో రియాజ్కు సైతం గాయాలయ్యాయి.
ఇదే క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు రియాజ్ను పట్టుకున్నారు. గాయాలైన వ్యక్తిని, అలాగే రియాజ్ను జీజీహెచ్కు తరలించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం జీజీహెచ్లోని ఓ వార్డులో మళ్లీ పోలీసులపై రియాజ్ దాడిచేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. గన్ లాక్కునేందుకు యత్నించగా.. ఆత్మ రక్షణలో భాగంగా పోలీసులు కాల్పులో జరగడంతో రియాజ్ హతమయ్యాడు. ఈ ఘటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Constable pramod | తన తండ్రి డ్యూటీకి వెళ్లాడనుకుంటున్నారు..
తన ముగ్గురు కొడుకులను అల్లారుముద్దుగా చూసుకునేవాడని కానిస్టేబుల్ ప్రమోద్ సతీమణి ప్రణీత విలపిస్తూ పేర్కొన్నారు. అభంశుభం తెలియని ఆ చిన్నారులు ఇప్పటికీ వాళ్ల నాన్న డ్యూటీకి వెళ్లారనే అనుకుంటున్నారని ఆమె విలపించారు.
పెద్దకొడుకు ప్రణీత్ ఎనిమిదో తరగతి చదువుతుండగా, రెండో కుమారుడు ప్రమిత్ ఆరో తరగతి చదువుతున్నాడు. మూడేళ్ల చిన్నకుమారుడు నరేన్ తన తండ్రి డ్యూటీ నుంచి ఎప్పుడు వస్తాడని వాళ్ల తల్లిని అడుగుతున్న దృశ్యాలు స్థానికులను కన్నీళ్లు పెట్టించాయి.
Constable pramod | దీపావళి పటాకులు తెస్తాడనుకుని..
తన తండ్రి హైదరాబాద్కు వెళ్లాడని.. వచ్చేటప్పుడు దీపావళి పటాకులు తీసుకొస్తాడని బాబు చెబుతున్న మాటలు స్థానికులను కలిచివేశాయి. దీపావళికి (Diwali) తన తండ్రి ఇంటికి వస్తాడనే భ్రమలోనే చిన్నకొడుకు ఉన్నాడని ఆయన కోసమే ఎదురుచూస్తున్నాడని కానిస్టేబుల్ భార్య చెబుతుంటే.. చుట్టు పక్కల వాళ్లు కంటతడి పెట్టారు.
Constable pramod | ఎక్స్గ్రేషియా ప్రకటించినా.. నా భర్త తిరిగి రాలేడు కదా..?
బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ విషయమై ప్రణీత స్పందించింది. కానీ రూ. కోటి ప్రకటించారు కానీ నా భర్తను తిరిగి తీసుకురాలేరు కదా అని వ్యాఖ్యానించారు. మృతిచెందిన ప్రమోద్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 300 గజాల ఇంటి స్థలం ఇవ్వడంపై ఆమె డీజీపీ శశిధర్ రెడ్డి (DGP Shashidhar Reddy), సీపీ సాయి చైతన్యలకు (CP Sai Chaitanya) ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేసి సరైన శిక్ష విధించారని అన్నారు. తన లాంటి పరిస్థితి మరో కుటుంబానికి రావద్దన్నారు.