అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట (Achampet)లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ (BRS) జనగర్జన సభలో ఆయన మాట్లాడారు.
అచ్చంపేట ప్రజలు తమ ఎమ్మెల్యే ఓడిపోతారు కానీ కేసీఆర్ సీఎం అవుతారని భావించారని కేటీఆర్ అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు అలా అనుకోవడంతోనే తాము ఓడిపోయాని చెప్పారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని కేటీఆర్ అన్నారు.
KTR | రేవంత్రెడ్డిలో అపరిచితుడు
రేవంత్రెడ్డిలో అపరిచితుడు ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. పొద్దున ఓ తీరు సాయంత్రం మరో తీరు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. రోజు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కేసీఆర్ జపం చేస్తారన్నారు. కేసీఆర్ను తిట్టడం తప్ప ఆయన ఏం చేయడం లేదని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి మాట్లాడినంత హీనంగా ఇంతవరకు ఏ సీఎం మాట్లాడలేదన్నారు. సీఎం పుట్టిన అచ్చంపేట నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ జనగర్జన యాత్ర ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. అచ్చంపేటలో ఎవరో పార్టీ నుంచి వెళ్లారని బాధ పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతకంటే మంచి నాయకుడిని కేసీఆర్ నిలబెడుతారని చెప్పారు. అచ్చంపేటలో గులాబీ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరారు.
KTR | ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ఆపే దమ్ముందా..
ఆల్మట్టి డ్యామ్ (Almatti Dam) ఎత్తు పెంచడానికి కర్ణాటక (Karnataka) ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఎత్తు పెంచితే తెలంగాణకు కృష్ణానది (Krishna River)కి చుక్కా నీరు రావని ఆయన పేర్కొన్నారు. నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్రెడ్డి పాలమూరు ఎండిపోయే పరిస్థితి వచ్చినా పిల్లిలా ఇంట్లో కూర్చున్నారని విమర్శించారు. పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాలను ఆపే ప్రయత్నం చేస్తుంటే.. ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆల్మట్టిని ఆపే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్గాంధీ (Rahul Gandhi)తో చర్చించి కర్ణాటక సీఎంను ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ఒప్పించాలన్నారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.
KTR | బోనస్.. బోగస్ అయింది
ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీ కార్డులు పంచిందన్నారు. ఈ రోజు ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలకు పడ్డా బాకీల కార్డులను తాము ఇంటింటికి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. దీంతో ఇప్పుడు గోస పడుతున్నారని చెప్పారు. యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. వరికి బోనస్ బోగస్ అయిందని కేటీఆర్ అన్నారు. బోనస్ ఇస్తామని చెప్పి ఖాతాల్లో జమ చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ హయాంలో 90శాతం పూర్తయిందన్నారు. పది శాతం పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ను రేవంత్రెడ్డి పక్కన పెట్టారని విమర్శించారు. మాట తప్పిన ఆయనను రాజకీయంగా సమాధి చేయాలని ప్రజలను కోరారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.