అక్షరటుడే, వెబ్డెస్క్ : Group -1 Exams | గ్రూప్–1 పరీక్షలపై ఇటీవల హైకోర్టు (High Court) సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ (TGPSC) డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది.
గ్రూప్–1 మెయిన్స్ పేపర్ల మూల్యాంకనం సక్రమంగా జరగలేదని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం గ్రూప్ 1 ఫలితాలు, ర్యాంకులు రద్దు చేస్తూ ఈ నెల 9న తీర్పు ఇచ్చింది. పేపర్ల రీ వాల్యూయేషన్ చేపట్టాలని, వీలు కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది.
Group -1 Exams | న్యాయనిపుణులతో చర్చించి..
గ్రూప్–1 పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం, టీజీపీఎస్సీ వాదిస్తున్నాయి. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే ప్రస్తుతం ర్యాంకులు వచ్చిన వారు నష్టపోతారు. దీంతో టీజీపీఎస్సీ న్యాయనిపుణులతో చర్చించి సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసింది. ఈ విషయంలో అవసరం అయితే సుప్రీంకోర్టు (Supreme Court)కు సైతం వెళ్లడానికి కమిషన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
Group -1 Exams | ఎలాంటి అక్రమాలు జరగలేదు
గ్రూప్-1 పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని మంత్రి శ్రీధర్బాబు (Minister Sridhar Babu) తెలిపారు. TGPSC చిత్తశుద్ధితో ముందుకువెళ్తోందని ఆయన చెప్పారు. గ్రూప్-1 ఉద్యోగాలు పొందిన ప్రతిభావంతులపై కొందరు నిందలు వేయడం అన్యాయమని ఆయన అన్నారు. కాగా ఉద్యోగాలను రూ.3కోట్లకు ఒకటి చొప్పున అమ్ముకున్నారని విపక్ష నాయకులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ర్యాంకర్ల తల్లిదండ్రులు (Parents) మంగళవారం మీడియాతో మాట్లాడారు. ర్యాంకుల వచ్చిన వారిలో కొందరు కూటికి గతి లేని వారు ఉన్నారని, వారు రూ.3 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా సింగిల్ బెంచ్ తీర్పుతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేయగా.. ర్యాంకర్లు ఆవేదన చెందుతున్నారు. దీనిపై డివిజన్ బెంచ్ ఎలాంటి తీర్పు చెబుతుందో చూడాలి.