అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Modi | ఉగ్రవాదం మానవాళికి సవాలుగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ శాంతికి పెను ముప్పుగా మారిన ఉగ్రవాదం విషయంలో ద్వంద ప్రమాణాలు వీడాలని పరోక్షంగా పాకిస్తాన్కు హితవు పలికారు.
సోమవారం జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Pakistan PM Shehbaz Sharif) పాల్గొన్న ఈ సమావేశంలో మాట్లాడిన మోదీ… ఉగ్రవాదం మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పు అని అభివర్ణించారు. సభ్య దేశాలను జీరో టాలరెన్స్(Zero Tolerance) విధానాన్ని అవలంబించాలని కోరారు. “ఉగ్రవాదం మానవాళికి ఉమ్మడి సవాలు. ఈ బెదిరింపులు కొనసాగుతున్నంత కాలం ఏ దేశం లేదా సమాజం తనను తాను సురక్షితంగా భావించలేవు” అని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.
PM Modi | ప్రపంచ మౌనం సరికాదు..
ఉగ్రవాద నెట్వర్క్లకు బహిరంగంగా మద్దతు ఇచ్చే లేదా ఆశ్రయం కల్పించే వారిని లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ(PM Modi) విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాలు ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలను పాటించే వారిని తిరస్కరించాలని పరోక్షంగా పాకిస్తాన్(Pakistan)ను ఉద్దేశించి పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రభుత్వమే మద్దతు ఇస్తూ ఎగదోస్తున్న ఉగ్రవాదంపై ప్రపంచం మౌనంగా ఉండడాన్ని మోదీ గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని మనం స్పష్టం చేయాలని అన్నారు.
PM Modi | అభివృద్ధి ప్రయాణంలో భాగం కావాలి..
భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో భాగం కావాలని ప్రపంచ శక్తులను ప్రధాని మోదీ ఆహ్వానించారు. “ఈ రోజు భారతదేశం సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతోంది… ప్రతి సవాలును అవకాశంగా మార్చడానికి మేము ప్రయత్నించాము… భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో భాగం కావాలని మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను” అని ఆయన పిలుపునిచ్చారు.
PM Modi | సహకారం పెంపొందించే దిశగా..
ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక సహకారం, బహుపాక్షిక దౌత్యంపై ప్రాధాన్యతనిస్తూ షాంఘై సహకార సదస్పు ప్రారంభమైంది. చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభించారు. వేగంగా మారుతున్న ప్రపంచ దృశ్యంలో ప్రాంతీయ శాంతిని కాపాడటంలో, సమతుల్య అభివృద్ధిని ప్రోత్సహించడంలో షాంఘై సహకార సంస్థ పెరుగుతున్న ప్రాముఖ్యతను గురించి మాట్లాడారు.