అక్షరటుడే, న్యూఢిల్లీ: terror plot | ఉగ్రవాదం కొత్త పుంతలు తొక్కుతోంది. విద్యార్థులు, సామాజికవేత్తల రూపంలోనే కాదు ఇప్పుడు వైద్యుల ముసుగులోనూ విస్తరిస్తోంది.
డాక్టర్ల రూపంలో పని చేస్తూ దేశంలో భారీ విధ్వంసానికి పన్నిన కుట్రను జమ్మూకశ్మీర్, హరియాణా పోలీసులు కలిసి ఛేదించారు.
జైష్-ఎ-మొహమ్మద్ (జెఇఎం), అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (ఏజీయూహెచ్) కు సంబంధించిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ను నిర్వీర్యం చేశారు.
2,900 కిలోగ్రాములకు పైగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలో భాగమైన పలువురు వైద్యులు సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ షాహిద్తో పాటు కాశ్మీర్కు చెందిన డాక్టర్లు అహ్మద్ గనై, డాక్టర్ అదీల్ సహా పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వీరంతా పాకిస్తాన్లోని తమ హ్యాండ్లర్లతో కమ్యూనికేట్ చేయడానికి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానెల్స్ను ఉపయోగిస్తున్నారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
terror plot | ఒక కేసు విచారణతో వెలుగులోకి కుట్ర..
గత నెలలో శ్రీనగర్ లో జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా పలు పోస్టర్లు వెలిశాయి. వీటిని కశ్మీర్కు చెందిన వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్ వేసినట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు.
అతడు యూపీ సహరాన్పుర్లోని ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతణ్ని గతవారం అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
నిందితుడు గతేడాది అక్టోబరు ముందు వరకూ అనంతనాగ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విధులు నిర్వర్తించాడని, అక్కడ అతని లాకర్ను తనిఖీ చేయగా రైఫిల్ దొరికిందని తెలిపారు.
అతను ఇచ్చిన సమాచారం మేరకు హరియాణాలోని ఫరిదాబాద్లో 350 కిలోల అమ్మోనియం నైట్రేట్ సంబంధిత పేలుడు పదార్థాలు, రైఫిల్ సహా 20 టైమర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మూడు మ్యాగజైన్లు, పిస్టల్, వాకీటాకీ సెట్ సైతం లభ్యమయ్యాయి.
terror plot | పలువురు డాక్టర్ల అరెస్టు
జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్లలో విస్తరించి ఉన్న ఉగ్రవాద మాడ్యూల్ను ఛేదించిన పోలీసులు లక్నోకు చెందిన ఒక మహిళా వైద్యురాలిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
ఆమెను లక్నోలోని లాల్ బాగ్ నివాసి అయిన డాక్టర్ షాహీన్ షాహిద్గా గుర్తించారు. ఆమె కారు నుంచి రైఫిల్ స్వాధీనం చేసుకున్న తర్వాత భద్రతా దళాలు అరెస్టు చేశాయని సోమవారం అధికారులు తెలిపారు.
ఆమెను కస్టడీ విచారణ కోసం శ్రీనగర్కు తరలించారు. ఈ కేసులో ఆమెతో పాటు మరో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.
శ్రీనగర్లోని నౌగామ్ ప్రాంతానికి చెందిన ఆరిఫ్ నిసార్ దార్ అలియాస్ సాహిల్, యాసిర్-ఉల్-అష్రఫ్, మక్సూద్ అహ్మద్ దార్ అలియాస్ షాహిద్, షోపియాన్ నివాసి మోల్వి ఇర్ఫాన్ అహ్మద్ (ఇమామ్), గండేర్బాల్లోని వకురా ప్రాంతంలో నివసించే జమీర్ అహ్మద్ అహంగర్ అలియాస్ ముత్లాషా, పుల్వామాలోని కోయిల్ ప్రాంతంలో నివసించే డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై అలియాస్ ముసైబ్, కుల్గాంలోని వాన్పోరా ప్రాంతంలో నివసించే డాక్టర్ అదీల్ను అరెస్టు చేసి, విచారిస్తున్నారు.
“దర్యాప్తులో వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ బయటపడింది.. ఇందులో పాకిస్తాన్, ఇతర దేశాల రాడికలైజ్డ్ నిపుణులు విద్యార్థులు విదేశీ హ్యాండ్లర్లతో సంబంధం కలిగి ఉన్నారు..”అని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు.
సామాజిక / ధార్మిక కారణాల ముసుగులో ప్రొఫెషనల్, విద్యా నెట్వర్క్ల ద్వారా నిధులు సేకరించడంతో పాటు తమకు అనుకూలమైన వారిని గుర్తించి వారిని టెర్రర్ హ్యాండ్లర్లుగా మల్చుతున్నారని వెల్లడించారు.
