HomeతెలంగాణKaleshwaram | తెలంగాణ జీవ‌ధార కాళేశ్వ‌రం.. హ‌రీశ్‌రావు ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్‌

Kaleshwaram | తెలంగాణ జీవ‌ధార కాళేశ్వ‌రం.. హ‌రీశ్‌రావు ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram | తెలంగాణ జీవ‌ధార కాళేశ్వ‌రం ప్రాజెక్టు (Kaleshwaram project) అని, ఈ ప్రాజెక్టుతోనే తెలంగాణ స‌స్య‌శ్యామ‌లం అవుతుంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై శనివారం ఆయ‌న తెలంగాణ భవన్‌లో పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ (power point presentation) ఇచ్చారు. ఈ ప్రెజెంటేషన్‌ అనంతరం మీడియాతో హరీష్‌రావు మాట్లాడారు. మొత్తంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు ద్వారా 20.33 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరందించామ‌ని చెప్పారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు మ‌హారాష్ట్ర (Maharashtra) అభ్యంత‌రం తెలప‌కుండా చ‌ర్చ‌లు జ‌రిపామని, ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 45 రోజుల‌కే మ‌హారాష్ట్ర‌కు వెళ్లి చ‌ర్చించి ఒప్పించామ‌న్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రయోజనాల కంటే.. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. కాళేశ్వరం కూలిందంటూ కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం(Kaleshwaram) కూలిందంటూ కాంగ్రెస్‌ దుష్ప్రచార చేస్తోందని మండిపడ్డారు.

Kaleshwaram | 240 టీఎంసీల వినియోగం..

కాళేశ్వరం (Kaleshwaram) అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌‌స్టేషన్లు.. 21 పంప్‌హౌస్‌లు, 203 కి.మీ. సొరంగాలు అని హరీశ్‌రావు (Harish Rao) తెలిపారు. కాళేశ్వరం అంటే 1.531 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలు, 98 కిలోమీటర్ల ప్రెజర్‌ మెయిన్స్‌.. 141 టీఎంసీల స్టోరేజ్‌ కెపాసిటీ, 530 మీ. ఎత్తు ఎత్తిపోతలని వివరించారు. త‌మ్మిడిహెట్టి నుంచి ఎల్లంప‌ల్లికి నీరు ఎత్తిపోసేలా మొద‌ట రూప‌క‌ల్ప‌న చేశార‌న్నారు. అయితే, త‌మ్మిడిహెట్టి వ‌ద్ద నీటి ల‌భ్య‌త త‌క్కువ‌గా ఉంటుంద‌ని ప్రాజెక్టును మేడిగ‌డ్డ‌కు మార్చామ‌ని చెప్పారు. కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల వినియోగం జరుగుతోందని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీని (Medigadda barrage) ఏడు బ్లాకులుగా, 85 పియ‌ర్లుగా నిర్మించామ‌న్నారు. మేడిగ‌డ్డ‌లో రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని చెప్పారు. బీఆర్ఎస్‌పై బురద జల్లేందుకే మేడిగడ్డకు రిపేర్లు చేయడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు. గతంలో ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు.

Kaleshwaram | కాంగ్రెస్‌ది దుష్ప్ర‌చారం..

బీఆర్ఎస్‌ ప్రభుత్వం (BRS government) వచ్చాక 2,300 చెరువులను నీటితో నింపామని హరీశ్‌రావు గుర్తుచేశారు. నీళ్ల విషయంలో కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. కాళేశ్వ‌రం లేకుండా పంట‌లు పండాయ‌ని కాంగ్రెస్ చెబుతోంద‌ని, ఈ ప్రాజెక్టు వ‌ల్ల‌నే యాసంగిలోనూ పంట‌లు పండాయ‌న్న విష‌యం మ‌ర్చిపోవ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. ఈ ప్రాజెక్టుకు మూడు వ‌న‌ల‌రు ద్వారా నీటి ల‌భ్యత ఉంద‌ని, ఆ నీటితో వేలాది చెరువుల‌ను నింప‌వ‌చ్చ‌ని చెప్పారు. మేడిగ‌డ్డ నుంచి మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ (Mallannasagar) వ‌ర‌కు నిర్మించినవన్నీ వాడుక‌లోనే ఉన్నాయ‌ని తెలిపారు. కాళేశ్వ‌రం కింద కాలువ ద్వారానే 90 వేల ఎక‌రాల‌కు నీళ్లు ఇవ్వొచ్చ‌ని చెప్పారు. కాళేశ్వ‌రంపై విమ‌ర్శ‌లు చేస్తున్న కాంగ్రెస్ బనకచర్ల ప్రాజెక్టుపై (Banakacharla project) ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఎస్సారెస్పీ తప్ప తెలంగాణలో ఎక్కడా స్టోరేజ్‌ కెపాసిటీ లేదని అన్నారు. కాళేశ్వరం లేకున్నా పంటలు పండాయని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. కేసీఆర్‌ను బద్నాం చేయడానికే కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. కాళేశ్వరం ద్వారా 20,33,578 ఎకరాలకు సాగునీరు అందిందని వెల్లడించారు.

Kaleshwaram | ప్రాజెక్టు క‌ట్ట‌కుండా కాల్వ‌ల నిర్మాణం..

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణ‌కు గోదావ‌రి జ‌లాల్లో 940 టీఎంసీల‌ను కేటాయించార‌ని, కానీ తెలంగాణ గోదావ‌రి జ‌లాల‌ను (Godavari waters) ఏనాడూ 400 టీఎంసీలకు మించి వాడుకోలేద‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. ప్రాణ‌హిత చేవెళ్ల ప్రాజెక్టుకు (Pranahita Chevella project) కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress government) నాలుగేళ్ల‌లో అనుమ‌తులు కూడా సాధించ‌లేద‌న్నారు. ప్రాజెక్టు నిర్మించ‌కుండానే కాల్వలు త‌వ్విన ఘ‌న‌త వారిదేన‌ని ఎద్దేవా చేశారు. 2007లో ప్రాణహిత-చేవెళ్లకు శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు (Pranahita-Chevella project) వ్యయం రూ.17 వేల కోట్లు అన్నారని.. ఆ ప్రాజెక్టు ప్రారంభించకుండానే 2011 నాటికి రూ.40 వేల కోట్లని మరోసారి చెప్పారన్నారు. నాలుగేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికారని.. కనీసం ప్రాజెక్టు అనుమతులు కూడా తీసుకురాలేదని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించకుండానే.. కాల్వల తవ్వకం పనులు చేపట్టారని తెలిపారు. సర్వే అండ్‌ మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల కింద.. కాంట్రాక్టర్లకు రూ.2,328 కోట్లు చెల్లించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లు చుక్క‌నీరు ఇవ్వ‌కుండా పంట‌ల‌ను ఎండ‌బెడితే, కాళేశ్వరం నీటి ద్వారా పంటలను కాపాడింది మాజీ సీఎం కేసీఆరే అని ఉద్ఘాటించారు.