అక్షరటుడే, హైదరాబాద్: Telangana Rising Global Summit | డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఈ సమ్మిట్కు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించేందుకు ముందుగానే జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు. సదస్సులో పాల్గొనే ఆహ్వానితులకు ఎక్కడా లోటు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Telangana Rising Global Summit | పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు..
ఈ సదస్సుకు హాజరు కావాలని ఇప్పటికే 2,600 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు అందించామని సమావేశంలో అధికారులు వివరించారు. పెట్టుబడులకు సంబంధించి సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సూచించారు.
విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, వక్తలకు సమయం ముందుగానే నిర్దేశించి క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక ఉండాలని చెప్పారు. ఒక్కో ఈవెంట్కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలని సూచించారు.
సమ్మిట్ కోసం ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ డిజైన్లను అధికారులు వివరించారు. మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం, పరిశ్రమలు, వైద్య రంగాలకు సంబంధించిన స్టాల్స్ విషయంలో సీఎం అవసరమైన జాగ్రత్తలను సూచించారు.
సమ్మిట్ సందర్బంగా ప్రదర్శించే డ్రోన్ షో తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పెంచే విధంగా ఉండాలని, అదే రీతిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సదస్సుకు సంబంధించి అన్ని డిజైన్లు నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
