అక్షరటుడే, వెబ్డెస్క్: Bihar Former CM | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, లాలూసింగ్ యాదవ్ సతీమణి రబ్రీదేవి (Bihar Former CM Rabri Devi) శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడు, బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ ప్రాణాలకు ముప్పు ఉందని, ఇందుకు బీజేపీ, జేడీయూ కుట్ర పన్నాయని ఆరోపించారు.
బీహార్ అసెంబ్లీ ఆవరణలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల అతడ్ని చంపడానికి నాలుగుసార్లు ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు. “అతన్ని చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తేజస్వి ప్రాణాలకు ముప్పు ఉంది. జేడీయూ, బీజేపీ తప్ప ఎవరు కుట్ర చేస్తారు” అని రబ్రీ దేవి ప్రశ్నించారు. అసెంబ్లీలో తేజస్వి యాదవ్కు (Tejaswi Yadav) హాని కలిగించడానికి కుట్ర జరుగుతోందని రబ్రీ దేవి ఆరోపించారు. జేడీయూ, బీజేపీపై నేరుగా దాడి చేస్తూ.. ఈ రెండు పార్టీలు తేజస్విని నాలుగుసార్లు చంపేందుకు ప్రయత్నించాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bihar Former CM | బీహార్ అసెంబ్లీలో హైడ్రామా..
బీహార్ లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై (Special Intensive Revision) రెండ్రోజుల క్రితం అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాపై ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Chief Minister Nitish Kumar) జోక్యం చేసుకోవడంతో తీవ్ర వాగ్వాదం చెలరేగింది. అన్పార్లమెంటరీ భాషను ఉపయోగించిన ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు.
పదే పదే ఆయన హెచ్చరించినప్పటికీ వెనక్కి తగ్గడానికి నిరాకరించిన అధికారపక్ష సభ్యులపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ లోపల, బయటా నల్లటి టీ-షర్టు ధరించి ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో తేజస్విని మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన స్పీకర్.. “నిన్న, కొన్ని చాలా దురదృష్టకర సంఘటనలు జరిగాయి. సభలోని కొంతమంది సిబ్బంది కూడా గాయపడ్డారు. దయచేసి ఈ రోజు అలాంటిదేమీ జరగకుండా చూసుకోండని” సూచించారు.