అక్షరటుడే, వెబ్డెస్క్ : Alliance Airlines | మరో విమానం సాంకేతిక లోపంతో రన్వేపై నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Airport)లో ఆదివారం చోటు చేసుకుంది.
అలియన్స్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సి ఉంది. మూడుసార్లు రన్వేపైకి వెళ్లిన విమానం సాంకేతిక సమస్యతో తిరిగి వచ్చింది. దీంతో అధికారులు విమానాన్ని నిలిపివేశారు. తిరుపతి (Tirupati) వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో ఆందోళన చేపట్టారు. 37 మంది ప్రయాణికులు ఆ విమానంలో తిరుపతి వెళ్లాల్సి ఉంది. ఫ్లైట్ ఆలస్యం కావడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Alliance Airlines | కొన్నాళ్లు సాఫీగా..
ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన బోయింగ్ విమానం జూన్ 12న కూలిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది మృతి చెందారు. అనంతరం వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు నెలకొన్నాయి. పలు విమానాలు రన్వే పై నిలిచిపోగా.. మరికొన్ని సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. వరుస ఘటనలతో ప్రజలు విమానాలు ఎక్కాలంటేనే భయపడ్డారు. అయితే ఇటీవల విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకపోవడంతో కొన్ని రోజులుగా సాఫీగా ప్రయాణాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మళ్లీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అలియన్స్ ఎయిర్లైన్స్ విమానం నిలిచిపోవడం గమనార్హం.
Alliance Airlines | మండిపడుతున్న ప్రయాణికులు
విమానాల్లో సాంకేతిక సమస్యలు (Technical issues) తలెత్తి ఆగిపోతుండటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమిషం ఆలస్యం అయినా ప్రయాణికులను లోనికి అనుమతించని ఎయిర్లైన్స్ సంస్థలు గంటల కొద్ది ఆలస్యం అయితే ప్రయాణికులకు పరిహారం చెల్లించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముందే విమానాల మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోవాలని.. బయలుదేరే ముందు నిలిచిపోతే తమ ప్రోగ్రామ్స్ నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.