అక్షరటుడే, వెబ్డెస్క్ : Fee reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ వృత్తి విద్యా కాలేజీలు నేటి (సోమవారం) నుంచి బంద్ పాటిస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.
రాష్ట్రంలో పేరుకుపోయిన రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల ఫెడరేషన్ డిమాండ్ చేసింది. బకాయిలు విడుదల చేయకపోతే ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు (Colleges) బంద్ చేస్తామని ఫెడరేషన్ నాయకులు గతంలోనే నోటీసులు ఇచ్చారు. దీంతో ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఫెడరేషన్ నేతలతో చర్చించారు. అర్ధరాత్రి 12:30 గంటల వరకు సాగిన చర్చలు విఫలం అయ్యాయి.
Fee reimbursement | పరీక్షలకు మినహాయింపు
ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ప్రైవేట్ కాలేజీలు (Private Colleges) బంద్ పాటిస్తున్నాయి. అయితే పరీక్షలకు మినహాయింపు ఇస్తున్నట్లు యాజమాన్యాలు పేర్కొన్నాయి. పరీక్షలు యథావిధిగా సాగుతాయని, తరగతులు మాత్రం నిర్వహించమని నాయకులు స్పష్టం చేశారు. కాగా సోమవారం హైదరాబాద్ నగరంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీలు బంద్ పాటించాయి. మరికొన్ని కళాశాలల్లో మాత్రం తరగతులు నిర్వహిస్తున్నారు.
Fee reimbursement | మరోసారి చర్చలు
ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది. సోమవారం మధ్యాహ్నం మరోసారి చర్చించనుంది. చర్చలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రైవేట్ కళాశాలల సమస్యలను అర్థం చేసుకున్నామని తెలిపారు. యాజమాన్యాలు కూడా సానుకూలంగా స్పందించాయని చెప్పారు. సాయంత్రం లోపు ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Fee reimbursement | మహాధర్నా చేపడుతాం..
రాష్ట్రంలో 10 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. దసరా (Dussehra) లోపు రూ.1,200 కోట్లు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ నెల 21,22 తేదీల్లో 10 లక్షల విద్యార్థులతో హైదరాబాద్ (Hyderabad)లో మహాధర్నా చేపడతామని వారు హెచ్చరించారు. తమ డిమాండ్లు నెరవేరిస్తేనే కాలేజీలు తెరుస్తామన్నారు.