అక్షరటుడే, ఆర్మూర్ : Collector Nizamabad | కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. ఆర్మూర్ డివిజన్లో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బుధవారం సందర్శించారు.
అలాగే జక్రాన్పల్లి మండలం మునిపల్లి, ఆర్మూర్ మండలం పిప్రి గ్రామాల్లో కొనసాగుతున్న కేంద్రాలను పరిశీలించారు. రైతుల నుండి సేకరించిన మొక్కజొన్న పంట నాణ్యతను తనిఖీ చేశారు.
Collector Nizamabad | రైతులతో మాటామంతి..
కేంద్రాల వద్ద ఆరబెట్టిన మొక్కజొన్న నిల్వలను పరిశీలించిన కలెక్టర్.. రైతులతో మాట్లాడారు. మద్దతు ధర అందించేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తేమ 14 శాతానికి లోబడి ఉండేలా ఆరబెట్టి, శుభ్రపర్చిన మొక్కజొన్న పంటను కేంద్రాలకు తెచ్చి పూర్తిస్థాయిలో మద్దతు ధర పొందాలని సూచించారు.
కాగా.. కొనుగోలు కేంద్రాల్లో (Purchasing Centers) రైతులకు తగిన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాల నిర్వాహకులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రైతులు తెచ్చిన పంట నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటే వెంటనే తూకం జరిపించి, ట్యాబ్ ఎంట్రీ చేయాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా కృషి చేయాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ రావు, మార్క్ఫెడ్ డీఎం మహేష్ కుమార్ తదితరులున్నారు.

