అక్షరటుడే, వెబ్డెస్క్ : Bondi Beach | ఆస్ట్రేలియాలోని (Australia) సిడ్నీ బాండీ బీచ్లో (Bondi Beach) జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూదుల హనుక్కా వేడుకలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో మొత్తం 16మంది ప్రాణాలు కోల్పోగా, 42 మంది గాయపడ్డారు.
ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు తండ్రీకొడుకులుగా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితులు 50 ఏళ్ల సాజిద్ అక్రమ్(Sajid Akram), అతని 24 ఏళ్ల కుమారుడు నవీద్ అక్రమ్. తండ్రి సాజిద్ వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి కాగా, కుమారుడు నవీద్ నిరుద్యోగిగా ఉన్నాడు. ఘటన స్థలంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సాజిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. నవీద్ (Naveed Akram) తీవ్ర గాయాలతో పట్టుబడగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Bondi Beach | నా కొడుకు మంచి వాడు..
అతని పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ నిలకడగా ఉందని వైద్యులు (Doctors) వెల్లడించారు. ఈ దాడిలో వీరిద్దరూ దూర శ్రేణి తుపాకులు (లాంగ్ ఆర్మ్స్) ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. దాడికి ముందు సౌత్ కోస్ట్కు చేపల వేటకు వెళ్తున్నామని నిందితులు తమ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది.ఈ ఘటనపై నవీద్ తల్లి వెరీనా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నా కొడుకు ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడని నమ్మలేకపోతున్నాను. అతడు చాలా మంచివాడు. పనికి వెళ్లడం, ఇంటికి రావడం, వ్యాయామం చేయడం తప్ప మరో ప్రపంచం తెలియదు” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
రెండు నెలల క్రితమే నవీద్ (Naveed) తన ఉద్యోగాన్ని కోల్పోయి, కొత్త పని కోసం ప్రయత్నిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ కాల్పుల్లో మృతి చెందిన వారిలో 10 ఏళ్ల బాలిక నుంచి 87 ఏళ్ల వృద్ధుడి వరకు ఉండటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో సిడ్నీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడగా, బాండీ బీచ్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటనపై పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.