అక్షరటుడే, వెబ్డెస్క్ : Drone | భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లోని రాజస్థాన్లో గురువారం ఉదయం అనుమానాస్పదంగా కనిపించిన డ్రోన్ను భద్రతా బలగాలు(Security Forces) స్వాధీనం చేసుకున్నాయి. శ్రీ గంగానగర్ జిల్లాలోని ఇరుదేశల సరిహద్దు సమీపంలో గల ఒక పొలంలో అనుమానిత డ్రోన్(Drone)ను స్వాధీనం చేసుకోవడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉదయం 9:45 గంటల సమయంలో అనుప్ఘర్ ప్రాంతంలో గ్రామస్తులు మానవరహిత వైమానిక వాహనాన్ని కనుగొన్నారు, వారు దానిని గుర్తించిన వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించారు. అనుప్ఘర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఈశ్వర్ జాంగిద్ వెంటనే సరిహద్దు భద్రతా దళం (BSF)కు సమాచారం అందించారు. పోలీసు బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. 5 నుంచి 7 అడుగుల పొడవు ఉన్న డ్రోన్ దెబ్బతిన్నట్లు కనిపించింది. దాని కెమెరా మాడ్యూల్ విరిగిపోయి ప్రధాన భాగం నుండి వేరుగా కనిపించింది.
Drone | విచారిస్తున్న అధికారులు
అనుమానిత డ్రోన్ను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు దాని గుట్టు విప్పే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. “మేము డ్రోన్ను స్వాధీనం చేసుకున్నాం. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ముందు జాగ్రత్త చర్యగా బాంబు నిర్వీర్య దళాన్ని కూడా పిలిపించాం” అని అధికారులు చెప్పారు. డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకోసం దాన్ని ఉపయోగించారో తెలియాల్సి ఉందన్నారు. సాంకేతిక విశ్లేషణల కోసం ఫోరెన్సిక్ పరీక్ష(Forensic examination)లకు పంపిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దులోని శ్రీ గంగానగర్ వ్యూహాత్మక స్థానాన్ని బట్టి ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. డ్రోన్ను సరిహద్దు అవతల నుంచి పంపించారా లేదా సైనిక కార్యకలాపాల సమయంలో అది దారి తప్పిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. “ఇండియా, పాకిస్తాన్ మధ్య ఇటీవలి శత్రుత్వాల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలలో భద్రతా దళాలు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నాయి. సరిహద్దు దగ్గర అలాంటి వస్తువు ఉండడం ఆందోళన కలిగించే విషయం” అని అధికారులు తెలిపారు.