అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా లంచాలు తీసుకుంటున్నారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను పట్టి పీడిస్తున్నారు.
ఏసీబీ అధికారులు దాడులు చేపడుతున్నా లంచాలకు మరిగిన ఆఫీసర్లు మారడం లేదు. అవినీతి చేయడం తమ హక్కుగా భావిస్తున్న వారు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా ఏసీబీ అధికారులు సర్వేయర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ACB Raid | సర్వే చేయడానికి..
మెదక్ (Medak) జిల్లా వెల్దుర్తి (Veldurthi) మండల సర్వేయర్ శ్రీనివాస్ బుధవారం ఏసీబీకి చిక్కాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన భూమి సర్వే చేయమని దరఖాస్తు చేసుకున్నాడు. సర్వే చేసి నివేదిక ఇవ్వడానికి సర్వేయర్ శ్రీనివాస్ రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడి బంధువు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బుధవారం రూ.20 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు సర్వేయర్ (Surveyor) శ్రీనివాస్, సర్వే (ప్రైవేట్) శిక్షకుడు గూడూరి శరత్ కుమార్ గౌడ్ను పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ACB Raid | అవీనితి కేంద్రాలుగా..
రాష్ట్రంలోని పలు తహశీల్దార్ కార్యాలయాలు (Tahsildar offices) అవినీతి కేంద్రాలుగా మారాయి. ఆయా ఆఫీసుల్లోని ఆపరేటర్ల నుంచి మొదలు పెడితే తహశీల్దార్ వరకు లంచాలు తీసుకుంటున్నారు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఏసీబీ దాడుల్లో ఎంతో మంది రెవెన్యూ అధికారులు దొరుకుతున్నారు. అయినా ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టడం లేదు. దీంతో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు.
ACB Raid | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
