అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | భూమి సర్వే చేయడానికి లంచం డిమాండ్ చేసిన సర్వేయర్తో పాటు అతడి సహాయకుడిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
అవినీతి అధికారులు మారడం లేదు. కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజలను లంచాల కోసం వేధిస్తున్నారు. ముఖ్యంగా తహశీల్దార్ (Tahsildar) కార్యాలయాల్లో అవినీతి యథేచ్ఛగా సాగుతోంది. ప్రతి పనికి ఓ రేటు కట్టి మరి డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే పనులు చేయకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా సిరిసిల్ల (Siricilla) మండల తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న మాడిశెట్టి వేణుగోపాల్, అతని ప్రైవేట్ సహాయకుడు సూర వంశీ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (ACB Officers) రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ACB Raid | సర్వే చేయడానికి..
సిరిసిల్ల మండల పరిధిలోని ఓ మహిళ తన భూమిని సర్వే చేయాలని సర్వేయర్ (Surveyor) వేణుగోపాల్ను కోరింది. సర్వే చేసి పంచనామా ప్రతిని అందించడానికి ఆయన రూ.30 వేల లంచం డిమాండ్ చేశాడు. అందులో ఇప్పటికే రూ.10 వేలు తీసుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలి కుమారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం రూ.20 వేల లంచం తీసుకుంటుండగా.. సర్వేయర్తో పాటు ఆయన ప్రైవేట్ సహాయకుడు సూర వంశీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు. వారిపై కేసు నమోదు చేశారు.
ACB Raid | అవినీతి కేంద్రాలుగా..
రాష్ట్రంలోని పలు తహశీల్దార్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ఆయా ఆఫీసుల్లోని పలువురు అటెండర్ల నుంచి మొదలు పెడితే తహశీల్దార్ల వరకు లంచాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఏసీబీ దాడులు పెరగడంతో పలువురు అధికారులు ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకొని మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజలు ఏదైనా పని కోసం వస్తే ముందు తమ ఏజెంట్లను కలవాలని సూచిస్తున్నారు. వారు చెప్పినంత ఇస్తేనే పనులు చేపడుతున్నారు.