అక్షరటుడే, వెబ్డెస్క్ : Supreme Court | తెలంగాణలో స్థానికత (Locality) అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. నీట్ ర్యాంకుల ఆధారంగా మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ విషయంలో స్థానికత అంశంపై పలువురు కోర్టును ఆశ్రయించారు.
నీట్ (NEET) ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో (Medical Colleges) సీట్లను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో 9, 10వ తరగతులు, ఇంటర్ ఫస్ట్, సెకండియర్ చదివిన వారు మాత్రమే స్థానిక రిజర్వేషన్కు అర్హులని గతంలో ప్రభుత్వం జీవో 33 జారీ చేసింది. దీనిపై కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెప్పడంతో ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.
Supreme Court | నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి
మెడికల్ కాలేజీ సీట్ల భర్తీ విషయంలో స్థానిక రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఆగస్టు 5న వాదనలు ముగిశాయి. అప్పుడు తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం సోమవారం వెలువరించింది. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి (CJI BR Gavai) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విద్యార్థులు ఇంటర్ ఇతర రాష్ట్రంలో చదివితే నష్టపోతారని వ్యాఖ్యానించారు. అయితే తాజాగా ప్రభుత్వ జీవోను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఆదేశాలను కొట్టేసింది. లోకల్ రిజర్వేషన్లు పొందాలంటే 9వ తరగతి నుంచి 12 వరకు తెలంగాణలో చదవాల్సిందే అని సుప్రీం స్పష్టం చేసింది.
Supreme Court | వారికి నష్టం..
ప్రస్తుతం పదో తరగతి వరకు స్థానికం చదివిన విద్యార్థులు ఇంటర్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా నీట్లో ర్యాంక్ కొట్టాలనుకునే విద్యార్థులు కోచింగ్ బాగా ఉండే స్టేట్లను ఎంచుకుంటున్నారు. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వారికి నష్టం జరగనుంది. తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వారికి మాత్రమే వైద్య కాలేజీ సీట్ల భర్తీలో లోకల్ రిజర్వేషన్ వర్తించనుంది.