అక్షరటుడే, వెబ్డెస్క్ : Pakistan | పాకిస్తాన్లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. వాయువ్య పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని పోలీసు శిక్షణ పాఠశాల(Police Training School)పై ఈ దాడి జరిగింది. ఈ సందర్భంగా ఐదు గంటల పాటు జరిగిన కాల్పుల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు మరణించారని పోలీసులు తెలిపారు.
అలాగే, ఆరుగురు పోలీసు సిబ్బంది(Police Staff) కూడా ప్రాణాలు కోల్పోయారని అధికారులు శనివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని రట్టా కులాచి పోలీసు శిక్షణ పాఠశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ప్రతీకార కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు(Terrorists) మొదటగా హతమయ్యారు, మరికొందరు ఆ ప్రాంగణంలో దాక్కున్నారు. క్లియరెన్స్ ఆపరేషన్(Clearance Operation)లో, మరో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు, దీంతో మొత్తం దాడి చేసిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది.
Pakistan | పేలుడు పదార్థాలున్న ట్రక్కుతో దాడి
ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కును శిక్షణా కేంద్రం ప్రధాన ద్వారాన్ని ఢీకొట్టారు. దీనితో భారీ పేలుడు సంభవించింది. యూనిఫాంలు ధరించిన ఉగ్రవాదులు ఆ ప్రాంగణంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో మొత్తం ఏడుగురు పోలీసు సిబ్బంది మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. శిక్షణ పొందుతున్న వారితో పాటు అక్కడి సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. వారందరినీ హుటాహుటిన వేరే ప్రాంతానికి తరలించారు. ఈ ఆపరేషన్ను SSG కమాండోలు, అల్-బుర్క్ ఫోర్స్, ఎలైట్ ఫోర్స్, స్థానిక పోలీసు యూనిట్లు సంయుక్తంగా నిర్వహించాయి.
Pakistan | ఆరుగురు ఉగ్రవాదులు హతం..
దాదాపు ఐదు గంటల పాటు జరిగిన కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి పేలుడు పదార్థాలు, అధునాతన ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కాల్పుల్లో గాయపడిన పోలీసు సిబ్బందిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఉగ్రదాడి సమయంలో శిక్షణ కేంద్రంలో దాదాపు 200 మంది ఉన్నరని పోలీసులు తెలిపారు.