అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం స్థానంలో కొత్తది నిర్మించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు. తమ తల్లిదండ్రులతో కలిసి నిరసన తెలిపారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ (kamareddy Municipality) పరిధిలోని రామేశ్వర్ పల్లి (Rameshwar Pally) గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
Kamareddy | పెచ్చులూడిన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో..
గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి గదిలోని పైకప్పు పెచ్చులు సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఊడిపడ్డాయి. ఆ సమయంలో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం నిమిత్తం బయట ఉన్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం విద్యార్థులతో కలిసి పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.
Kamareddy | కలెక్టర్ చెప్పినా పట్టించుకోవట్లేదు..
పెచ్చులూడిన సమయంలో తరగతి గదిలో తమ పిల్లలు ఉంటే పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నించారు. పాఠశాల పరిస్థితి చూసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) డిస్మెంటల్ చేయాలని ఆర్అండ్బీ అధికారులకు ఆదేశాలిచ్చారని గ్రామస్థులు పేర్కొన్నారు. అయితే అధికారులు మాత్రం గ్రామస్థులే పాఠశాలను డిస్మెంటల్ చేయాలని, అయితేనే తాము నూతన భవనానికి ముగ్గు వేస్తామని చెబుతున్నారని వారు పేర్కొన్నారు. తాము ఏమైనా మేస్త్రీ పనిచేసే వాళ్లమా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ తమ పాఠశాలకు మరోసారి వచ్చి పరిస్థితిని కళ్లారా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.
పాఠశాలలో పెచ్చులూడిన పైకప్పు