అక్షరటుడే, ఇందూరు : Polytechnic College | విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖల సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో (Polytechnic College) నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాలను శుక్రవారం ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలతో (Collector Vinay Krishna Reddy) కలిసి ప్రారంభించారు.
వసతి గృహ నిర్మాణాల కోసం పూర్వ విద్యార్థి ప్రతాప్ రెడ్డి రూ. 1.06 కోట్ల విరాళం అందించగా.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ రూ. 2.86 కోట్ల నిధులను విరాళంగా అందజేసింది. ఈ నిధులతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో బాలబాలికలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం వేర్వేరుగా నిర్మించిన నూతన వసతి గృహాలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గత పదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సాంకేతిక విద్యను బలోపేతం చేయాలనే కృత నిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి అనేక చర్యలు చేపడుతున్నారన్నారు. ఆధునిక సాంకేతిక విద్యను అభివృద్ధి చేయడం ద్వారా యువతకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో మెరుగైన సాంకేతిక విద్యను బోధిస్తూ విద్యార్థుల ఉజ్వల భవితకు బాటలు వేయాలని అధ్యాపకులకు సూచించారు.
ఈ మేరకు అవసరమైన అన్ని మౌలిక, వసతి సదుపాయాలను కల్పించేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. దేశ భవిష్యత్తుకు పునాదిగా నిలవాల్సిన విద్యార్థులు సైతం క్రమశిక్షణతో మెలుగుతూ సాంకేతిక విద్యతో కూడిన అంశాలను చక్కగా ఆకళింపు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ (Mohammed Shabbir Ali) మాట్లాడుతూ.. నేటి సామాజిక అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక విద్యతో కూడిన కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 66 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. నిర్దేశిత కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు సత్వరమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుందని చెప్పారు. ఇందుకోసం టాటా కంపెనీతో ఒప్పందం సైతం కుదుర్చుకుందని తెలిపారు.
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. భారతదేశ ప్రగతికి కృషి చేసిన దార్శనికుడు, దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున పాలిటెక్నిక్ కళాశాలలో హాస్టళ్లను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి ఎనలేని ప్రాధాన్యతస్తూ పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిజామాబాద్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేస్తున్నామన్నారు.
ఇందులో భాగంగానే ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేయించామని గుర్తు చేశారు. దీంతో పాటు డిచ్పల్లి తెలంగాణ విశ్వ విద్యాలయంలో (Telangana University) అగ్రికల్చర్ యూనివర్సిటీని కూడా నెలకొల్పేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. కాగా.. వసతి గృహాల నిర్మాణాల కోసం విరాళం అందించిన పూర్వవిద్యార్థి ప్రతాప్ రెడ్డిని, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సహాయ జనరల్ మేనేజర్ సెల్వంలను ఈ సందర్భంగా సత్కరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ రమేశ్ రెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ భారతి, రాష్ట్ర సాంకేతిక విద్య మండలి కార్యదర్శి ఏ పుల్లయ్య, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు బాల నరసింహులు, ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
