అక్షరటుడే, కామారెడ్డి: kamareddy Police | ఆన్లైన్ గేమ్కు (online games) బానిసై, ఇతర చోట్ల అప్పులు చేసి వాటిని తీర్చేందుకు చోరీలకు పాల్పడ్డాడు ఓ విద్యార్థి. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వృద్ధురాలు కొండ లలిత వివేకానంద కాలనిలో నివాసం ఉంటుంది.
మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని ఓ యువకుడు వృద్ధురాలిని మంచినీళ్లు ఇవ్వాలని అడిగాడు. ఇంట్లోకి వెళ్లి నీళ్లు తెచ్చి ఇచ్చే సమయంలో ఆమె మెడలో ఉన్న గొలుసు లాక్కుని పారిపోయాడు.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టారు. అయితే కాలనీలో ఓ అనుమానిత వ్యక్తి తిరుగుతున్నట్లుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సీసీ కెమెరాల (CCTV cameras) ద్వారా అతన్ని పట్టుకున్నారు. అతడిని నాందేడ్ (Nanded) జిల్లా ముగావ్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల దుయ్యవార్ రోహిత్ మారుతిగా పోలీసులు గుర్తించారు.
అయితే ఆ యువకుడు నీట్ పరీక్ష రాసి వెటర్నరీ సీటు పొందాడని ఏఎస్పీ తెలిపారు. ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి తండ్రి వద్ద రూ.20 వేలు, స్నేహితుని వద్ద రూ.40 వేల తీసుకున్నాడని, అప్పులు తీర్చే మార్గం లేక డిప్రెషన్లోకి వెళ్లి చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడని పేర్కొన్నారు. నాందేడ్ నుంచి రైలులో వచ్చి వృద్ధురాలి మెడలో చైన్ దొంగిలించాడని తెలిపారు. యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
ఒంటరి మహిళలు, వృద్ధులు అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని ఏఎస్పీ సూచించారు. అలాగే యువత ఆన్లైన్ గేమింగ్కు దూరంగా ఉండాలని, వాటికి అలవాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు. కొద్దినెలల క్రితం ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడి అప్పులపాలై సాఫ్ట్వేర్ ఉద్యోగి (software employee) ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో పట్టణ సీఐ నరహరి, ఎస్సై బాల్రెడ్డి పాల్గొన్నారు.
