అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Government | రాష్ట్రంలో ఆందోళనల పర్వం సాగుతోంది. సర్కారుపై సమరభేరీ మోగుతోంది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వివిధ వర్గాలు నిరసనలకు దిగుతున్నాయి. యూరియా కోసం రైతులు ధర్నాలకు దిగుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు (ASHA workers) ఆందోళనలు చేపడుతున్నారు.
పింఛన్ల పెంపుకోసం (pension hike) దివ్యాంగులు ఊరూరా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అంగన్ వాడీలు సమ్మెలో ఉన్నారు. రేషన్ డీలర్లు కూడా పోరుబాట పట్టారు. పీఆర్సీ, డీఏల (PRC and DA) కోసం ఉద్యోగులు తరచూ రోడ్డెక్కుతున్నారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రులు (Private hospitals) నేటి రాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయనున్నాయి. ఇక నిన్ననే వృత్తివిద్యా కళాశాలలు నిరవధిక బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే, ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో అవి కాస్త ఆందోళన విరమించాయి. ఇలా రాష్ట్రంలో అన్ని వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. హామీలు నిలబెట్టుకోక పోవడం, నిధులు విడుదల చేయక పోవడం, బకాయిలు చెల్లించక పోవడంతో ధర్నాలు, ఆందోళనలతో తెలంగాణ దద్దరిల్లుతోంది.
Telangana Government | ఎందుకిలా..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తోంది. ప్రభుత్వ పాలన ఇప్పటికీ కుదురుకోలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. ఏ ఒక్క వర్గానికీ సరైన న్యాయం చేసిందీ లేదు. ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ (Congress party) అన్ని వర్గాలపై హామీల వర్షం కురిపించింది. పాత పథకాల కొనసాగింపుతో పాటు కొత్తవి అమలు చేస్తామని ఓటర్లను నమ్మించింది. కాంగ్రెస్ హామీలపై ఆకర్షితులైన ఓటర్లు పట్టం కట్టారు.
బలమైన బీఆర్ఎస్(BRS)ను ఓడించిన కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందన్న పేరు తెచ్చుకుంది. వాస్తవానికి ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా అమలు చేస్తున్నా, ఇచ్చిన హామీల్లో కొన్నింటిని అమలు చేసిన కూడా ప్రభుత్వంపై సానుకూల స్పందన కనిపించట్లేదు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, మహిళలకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణం, గ్రూప్ పరీక్షల నిర్వహణ, రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ వంటివి అమలు చేసినా ప్రభుత్వానికి అంత గొప్పగా పేరు రాలేదు.
Telangana Government | ఇబ్బందుల్లో రైతాంగం
రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ప్రధానంగా యూరియా దొరకక తీవ్రంగా ఆందోళన చెందుతోంది. ఎరువు వేసే అదును దాటుతుండడంతో దిగాలు చెందుతున్నారు. పనులన్సీ మానుకుని రాత్రీపగలూ సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రైతులకు (Farmers) సరిపడా ఎరువులు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది.
వాస్తవానికి యూరియా కొరత దేశమంతటా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాన్ని రైతులకు వివరించడంలో, యూరియా కొరతను (Urea Shortage) నివారించడంలో వైఫల్యం చెందింది. అంతేకాదు, రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయలేక పోయిన ప్రభుత్వం.. రూ.500 బోనస్ ఇవ్వడంలోనూ విఫలమైంది. ఇక, రెండుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు సరిపడా యూరియా ఇవ్వలేక రైతుల ఆగ్రహానికి గురవుతోంది.
Telangana Government | అన్ని వర్గాల పోరుబాట..
ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. పీఆర్సీ లేకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. ఇక, కాంట్రాక్ట్ ఉద్యోగులు సైతం ఆందోళనలకు దిగుతున్నారు. ఆశలు, అంగన్ వాడీలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమ్మె నిర్వహిస్తున్నారు. కమీషన్ల కోసం రేషన్ డీలర్లు పోరుబాట పట్టారు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వడం లేదని ప్రైవేట్ ఆస్పత్రులు (Private Hospital) సేవలు నిలిపివేసేందుకు సిద్ధమయ్యాయి. వేతనాల కోసం చాలారోజులుగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు భారీగా పేరుకు పోవడంతో సోమవారం నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. చివరకు సర్కారు దిగివచ్చి దీపావళి లోపు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గాయి.
Telangana Government | దిగజారిన ఆర్థిక పరిస్థితులు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దారుణంగా దిగజారి పోయాయి. రియల్ ఎస్టేట్ వంటి కీలక రంగాలు పడకేయడంతో ఆదాయం తగ్గిపోయింది. రెవెన్యూ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ వంటి శాఖల నుంచి వచ్చే ఆదాయం వేతనాలు, రుణాలకు వడ్డీలకే సరిపోతోంది. సంక్షేమ పథకాల కొనసాగింపునకు అప్పులు తేవాల్సి వస్తోంది. రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని, రుణాలు కూడా దొరకడం లేదని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) చెప్పారంటేనే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. స్థానిక సంస్థల పాలకమండళ్లు లేకు కేంద్ర నిధులు ఆగిపోయాయి. బయట ఎక్కడా రుణాలు దొరకడం లేదు. దీంతో అరకొరగా వస్తున్న ఆదాయంతో సర్కారు నెట్టుకొస్తోంది. అన్ని వర్గాలను సంతృప్తి పరచలేక సతమతమవుతోంది.