అక్షరటుడే, వెబ్డెస్క్: Kamareddy | కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోరీ కేసులో పట్టుబడిన బైకును అమ్మిన ఘటన కలకలం రేపుతోంది. 2024లో నమోదైన ఓ కేసులో 29 టూవీలర్లను అప్పటి పోలీసులు రికవరీ చేశారు. కాగా.. ఇందులో ఓ బైకు తాజాగా పోలీసులకు వాహనాల తనిఖీల్లో పట్టుబడడం.. తీరా కానిస్టేబులే సదరు వాహనాన్ని అమ్మినట్లు గుర్తించడం చర్చకు దారితీసింది.
Kamareddy | అసలేం జరిగిందంటే..
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైం నంబర్ 29/2024లో బైకు దొంగతనాలకు సంబంధించిన కేసు నమోదై ఉంది. కాగా.. వివిధ ప్రాంతాల నుంచి దొంగతనం చేసిన 29 టూ వీలర్లను అప్పటి సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రికవరీ చేశారు. ఇందులో కొన్ని టెంపరరీ రిజిస్ట్రేషన్లు, నంబర్ ప్లేట్లు లేని వాహనాలుగా గుర్తించారు. వీటిలో కొన్నింటిని సేఫ్ కస్టడీ నిమిత్తం కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఉంచారు. కాగా.. గతంలో పనిచేసిన ఓ అధికారి, మరో కానిస్టేబుల్ కలిసి ఓ టూ వీలర్ను అమ్ముకున్నట్లు గుర్తించారు. సదరు మైలార్ దేవునిపల్లికి చెందిన వ్యక్తిది కాగా.. సదరు వాహనం చోరీకి గురైందని.. అనంతరం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లోనే రికవరీ అయ్యింది. అయితే సదరు వాహన యజమానికి ఇప్పటి వరకు బండి ఇవ్వలేదు. మరోవైపు పోలీస్ సేఫ్ కస్టడీ ఉంచాల్సి ఉండగా.. దానిని అమ్ముకున్నారు.
Kamareddy | కానిస్టేబుల్పై ఆరోపణలెన్నో..
ఈ మొత్తం వ్యవహారంలో కానిస్టేబుల్ విశ్వనాథ్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సీఐ చంద్రశేఖర్ రెడ్డి హయాంలో సదరు కానిస్టేబుల్ చేతుల మీదుగానే అన్ని రకాల లావాదేవీలు, అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లలో కీలకంగా వ్యవహరించారు. పలుమార్లు ఏసీబీ ట్రాప్ నుంచి తప్పించుకున్నట్లు ప్రచారంలో ఉంది. గతంలో అనేక ఫిర్యాదులు వెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు లేకుండా అప్పటి సీఐ కాపాడినట్లు సమాచారం. కాగా.. సదరు కానిస్టేబుల్ను ఇటీవల గాంధారికి బదిలీ చేశారు. బైకు అమ్మిన విషయం వెలుగులోకి రావడంతో ఈ ఘటనను ఎస్పీ రాజేష్ చంద్ర సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. అప్పటి ఎస్హెచ్వోగా వ్యవహరించిన అధికారిపై ఎలాంటి చర్యలు ఉంటాయో వేచిచూడాలి.
