అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy Rains | రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ఆయన శనివారం ఉదయం ఉన్నతాధికారులతో మాట్లాడారు.
రాష్ట్రంలోని 15 జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను ముందుగానే మోహరించామని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు (Rescue Operations) చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వాగులు, నదులు ఉధృతంగా పారుతుండటంతో అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు.
Heavy Rains | నీటిమట్టాన్ని పరిశీలించాలి
నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై నుంచి రాకపోకలు నిషేధించాలన్నారు.
Heavy Rains | పారిశుధ్య పనులు చేపట్టాలి
వర్షపు నీరు (Rain Water) నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని సీఎం అన్నారు. దీంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
Heavy Rains | సమన్వయంతో పని చేయాలి
భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని సీఎం అన్నారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పురపాలక, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని ఆయన ఆదేశించారు.