అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (SRSP)కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. అధికారులు 16 గేట్లను ఎత్తి గోదావరి (Godavari)లోకి నీటిని విడుదల చేస్తున్నారు.
జలాశయంలోకి ప్రస్తుతం 59,454 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 16 వరద గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేలు, సరస్వతి కాలువకు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది. గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతుండటంతో నది పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Sriram Sagar | నిజాంసాగర్లోకి..
అక్షరటుడే, ఎల్లారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్ట్ (Nizam Sagar Project)లోకి 27,352 క్యూసెక్కుల వరద వస్తోంది. వరద గేట్ల ద్వారా అంతేమొత్తంలోన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం అంతేమొత్తంలో నీరు నిల్వ ఉంది.
Sriram Sagar | యాసంగికి ఢోకా లేనట్లే..
ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరామ్సాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు వానాకాలం పూర్తయినా.. నిండుకుండల్లా ఉన్నాయి. ఇంకా వరద కొనసాగుతోంది. అలాగే పోచారం ప్రాజెక్ట్ (Pocharam Project) సైతం పొంగి పొర్లుతోంది. చెరువులు సైతం నిండుకుండల్లా ఉన్నాయి. ప్రస్తుతం వానాకాలం సాగు సీజన్ దాదాపుగా అయిపోయింది. మరో 15 రోజుల్లో రైతులు యాసంగి సాగుకు భూములను సిద్ధం చేసుకుంటారు. ఈ క్రమంలో ఖరీఫ్ పూర్తయ్యే వరకు ప్రాజెక్ట్లకు వరద కొనసాగుతుండటంతో యాసంగి పంటలకు ఢోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

