అక్షరటుడే, వెబ్డెస్క్ : Bihar Elections | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని భావిస్తున్న విపక్ష కూటమి మహా ఘట్బంధన్లో చీలిక వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
సీట్ల పంపకం కొలిక్కి రాకముందే ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) చేసిన ప్రకటన కూటమిలో విభేదాలను బయటపెట్టింది. ఈ ఏడాది చివరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆర్జేడీ, కాంగ్రెస్ సహా ఇతర పక్షాల కూటమి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రాహుల్గాంధీ (Rahul Gandhi), తేజస్వి కలిసి పాదయాత్ర కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు మహాఘటబంధన్ మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం ఇంకా ఖరారు కాలేదు, ప్రతిపక్ష ఇండియా బ్లాక్ నాయకులు ఇంకా పంపిణీపై చర్చలు జరుపుతున్న తరుణంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు. బీహార్లోని 243 నియోజకవర్గాల్లో తేజస్వి అభ్యర్థులు ఉంటారని, తన పేరు మీద వారికి ఓటు వేయాలని కోరారు. ఆయన చేసిన ప్రకటన మిత్ర పక్షాల్లో గందరగోళానికి దారి తీసింది. మహా ఘట్ బంధన్లోని పార్టీలు కలిసే ఉంటాయా.. లేక విచ్ఛిన్నమవుతుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి.
Bihar Elections | 243 స్థానాల్లోనూ పోటీ..
ముజఫర్పూర్లో శనివారం జరిగిన ర్యాలీలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తేజస్వి ప్రతిచోటా పోటీ చేస్తాడని, మీరంతా తేజస్వికి ఓటు వేయాలన్నారు. “మీరందరూ ఐక్యంగా ఉండాలి, ఈసారి తేజస్వి 243 స్థానాల్లోనూ పోటీ చేస్తారు. కాంతి అయినా, ముజఫర్పూర్ అయినా, గైఘాట్ అయినా, తేజస్వి ప్రతి చోటా ఎన్నికల్లో పోటీ చేస్తారు. మీరందరూ తేజస్వికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బీహార్ను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తాం. 20 సంవత్సరాలుగా అధికారంలో ఉండి మత హింసను వ్యాప్తి చేయడానికి పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని” ఆయన కోరారు.
Bihar Elections | సీట్ల షేరింగ్పై చర్చలు
మహాఘట్ బంధన్లో ఆర్జేడీ, కాంగ్రెస్, హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా, పశుపతి పరాస్ లోక్ జనశక్తి పార్టీ భాగస్వామ్యంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాలపై జరుగుతున్న చర్చలు క్లిష్టంగా మారాయి.
సీట్ల పంపకంపై ఆర్జేడీ కాస్త ఉదారంగా వ్యవహరించాలని కాంగ్రెస్ (Congress) రాష్ట్ర ఇన్ఛార్జ్ కృష్ణ అల్లవారు ఇటీవలే పేర్కొన్నారు. “కొత్త పార్టీలు కూటమిలో చేరినప్పుడల్లా, అన్ని సభ్యులు తమ సీట్ల వాటాలను సర్దుబాటు చేయడం ద్వారా సహకరించడం చాలా అవసరం” అని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో గెలుపు పరంగా కొన్నిమంచి సీట్లు, ప్రతికూల సీట్లు ఉంటాయని, ఒక పార్టీకి అన్ని మంచి సీట్లే ఇవ్వాలంటే కుదరదన్నారు. సీట్ల పంపకంలో మంచి, ప్రతికూల సీట్ల విషయంలో అన్ని పార్టీలకు సమన్యాయం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తేజస్వి తాజా ప్రకటన వెలువడింది. దీంతో విపక్ష కూటమిలోని లుకలుకలు బయటపడ్డాయన్న ప్రచారం జరుగుతోంది.
Bihar Elections | 2020లో మోస్తరుగా సీట్లు
2020 లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ అత్యధిక స్థానాల్లో పోటీ చేసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేసి, 75 గెలుచుకుని, ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 19 చోట్ల మాత్రమే గెలిచింది. అక్టోబర్ లేదా నవంబర్లో జరుగనున్న ఎన్నికల కోసం ఆయా పార్టీలు కొద్దిరోజులుగా చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో తేజస్వి తాజా ప్రకటన పొత్తులపై ప్రభావం చూపుతుందన్న చర్చ జరుగుతోంది.