అక్షరటుడే, కామారెడ్డి: Speed guns | వాహనాల వేగాన్నికట్టడి చేసేందుకు స్పీడ్ లేజర్ గన్స్ వాడుతున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. వాహనాల వేగాన్ని నియంత్రించడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయన్నారు. దీంతో ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.
జిల్లాలోని సదాశివనగర్ పరిధిలో (Sadashiv nagar) స్పీడ్ లేజర్ గన్స్ను (Speed Laser Guns) కలెక్టర్, ఎస్పీలు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న భద్రతా చర్యలు, కట్టుదిట్టమైన నిబంధనల అమలు ఫలితంగా ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. 2024 ఆగస్టు వరకు జిల్లాలో మొత్తం 188 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, 2025 ఆగస్టు వరకు వాటిని 145కి తగ్గించగలిగామని తెలిపారు.
దీని ద్వారా మొత్తం 22.9శాతం తగ్గుదల నమోదైందన్నారు. అదేవిధంగా మరణాలు 197 నుండి 153కి తగ్గి 22.3శాతానికి తగ్గిందన్నారు. అలాగే గాయపడ్డ కేసులు కూడా 181 నుండి 173కి తగ్గగా, గాయపడిన వ్యక్తులు 355 నుండి 298కి తగ్గడం ద్వారా రోడ్డు ప్రమాదాల నియంత్రణలో గణనీయమైన తగ్గుదల నమోదైందని పేర్కొన్నారు.
ఇది జిల్లాస్థాయిలో రోడ్డు భద్రతా చర్యల విజయాన్ని సూచిస్తూ, ప్రజల ప్రాణ రక్షణలో ఒక గొప్ప ముందడుగుగా నిలిచిందన్నారు. ప్రతిరోజూ వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్, లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు, అతివేగంగా ప్రయాణించే వారిపై జరిమానాలు విధించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గించగలిగామన్నారు.
జిల్లాలో మొత్తం మూడు స్పీడ్ లేజర్ గన్స్ వాహనదారుల వేగాన్ని నియంత్రించడం కోసం పనిచేస్తున్నాయని, అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించి క్రమంగా వారి వాహనాల వేగ నియంత్రణ చేయడం, తద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఇకపై ఈ లేజర్ గన్స్ 44వ జాతీయ రహదారి, 161 జాతీయ రహదారి, రాష్ట్ర రహదారులపై ఉంటాయని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా వాహనదారులు తమ ప్రాణాన్ని, తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.