HomeUncategorizedNational Herald case | ఇర‌కాటంలో సోనియా, రాహుల్‌.. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కోర్టు నోటీసులు

National Herald case | ఇర‌కాటంలో సోనియా, రాహుల్‌.. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కోర్టు నోటీసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :National Herald case | కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi) చిక్కుల్లో ప‌డ్డారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఇద్ద‌రు రూ.142 కోట్లు లబ్ది పొందారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఈ మేర‌కు రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ స‌మాచారమిచ్చింది. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సామ్ పిట్రోడా, ఇతరులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

National Herald case | ఆయాచిత ల‌బ్ధి

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)లపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. నేర కార్యకలాపాల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొందిన ఏదైనా ఆస్తి నేర ఆదాయంగా అర్హత పొందుతుందని ED ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హొస్సేన్ వాదించారు. తల్లీతనయులిద్దరూ రూ.142 కోట్లు అయాచితంగా లబ్ధి పొందారని ఆరోపించారు. నేర కార్యకలాపాల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొందిన ఏ ఆస్తినైనా నేర ఆదాయంగా పరిగణిస్తారని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఇందులో షెడ్యూల్డ్ నేరాల నుంచి వచ్చిన ఆస్తులు మాత్రమే కాకుండా ఆ ఆస్తులతో ముడిపడి ఉన్న ఆదాయం కూడా ఉంటుందన్నారు.

నిందితులు అందుకున్న రూ.142 కోట్ల అద్దె ఆదాయాన్ని నేర ఆదాయంగా పరిగణించాలని హొస్సేన్ పేర్కొన్నారు. యంగ్ ఇండియన్‌లో 76% వాటాను సమిష్టిగా కలిగి ఉన్న సోనియా, రాహుల్ గాంధీ నమ్మక ద్రోహానికి పాల్ప‌డ్డారు అన్నారు. యంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) నుండి రూ.90.25 కోట్ల విలువైన ఆస్తులను కేవలం రూ.50 లక్షలకు సంపాదించిన‌ట్లు ఈడీ తెలిపింది. దీంతో కోర్టు కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ చేసింది.

National Herald case | గత నెలలో చార్జిషీట్..

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు(National Herald case)లో ఈడీ గత నెలలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో సోనియా, రాహుల్ స‌హా ఇత‌రుల‌పై రూ.988 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఆరోపించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)లోని బహుళ సెక్షన్ల కింద ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో చార్జిషీట్ దాఖ‌లు చేసింది. చార్జిషీట్‌లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మొదటి నిందితురాలిగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు కూడా అయిన ఆమె కుమారుడు రాహుల్ గాంధీని రెండవ నిందితుడిగా పేర్కొన్నారు.

తన ఆరోపణలకు మద్దతుగా ఆదాయపు పన్ను శాఖ నుంచి 2017లో వచ్చిన అసెస్‌మెంట్ ఆర్డర్‌ను ఈడీ ఆధారంగా పేర్కొంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL), యంగ్ ఇండియన్ ప్రధాన అధికారులతో సమన్వయంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC)లోని కీలక సభ్యులు, దాదాపు రూ.2,000 కోట్ల విలువైన AJL ఆస్తులను నియంత్రించడానికి నేరపూరిత కుట్ర పన్నారని పేర్కొంది. 2012లో బీజేపీ నాయకుడు సుబ్రహ్మ‌ణ్య‌ స్వామి ట్రయల్ కోర్టులో ఫిర్యాదు చేయడంతో నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు వెలుగులోకి వ‌చ్చింది. AJLను కొనుగోలు చేసే ప్రక్రియలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు మోసం, నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

Must Read
Related News