అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | తమ ప్లాట్లలోకి వెళ్లే దారిని ఓ వ్యక్తి మూసి వేశాడని కొందరు 8 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. తాజాగా హైడ్రా అధికారులు అడ్డు గోడను తొలగించి ఆ సమస్యకు పరిష్కారం చూపారు. దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
మేడ్చల్ – మల్కాజిగిరి (Medchal – Malkajgiri) జిల్లా పోచారం మున్సిపాలిటీ ప్రతాప్ సింగారంలోని సర్వే నంబరు 315, 316, 317లలో 27 ఎకరాల పరిధిలో లే అవుట్ వేశారు. దాదాపు 400 ప్లాట్లతో 1978లో వేసి భవానీ నగర్ లే అవుట్కి గ్రామపంచాయతీ అనుమతి ఉంది. ఈ ప్రాంతం తర్వాత మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది. ఆరుగురు వ్యక్తులకు చెందిన 27 ఎకరాల భూమితో లే అవుట్ వేశారు. ఇందులో భాగస్వామిగా ఉన్న మలిపెద్ది బుచ్చిరెడ్డికి జీపీఏ ఇవ్వడంతో ప్లాట్లు అభివృద్ధి చేశారు. ఇందులో మలిపెద్ది జనార్దన్రెడ్డికి చెందిన 6.14 ఎకరాల భూమి కూడా ఉంది.
Hydraa | ధరణిలో దరఖాస్తు చేసుకొని..
జనార్దన్ రెడ్డి కుమారుడు మధుసూధన్ రెడ్డి తన పేరిట ఉన్న భూమిని ధరణిలో దరఖాస్తు చేసుకుని వ్యవసాయ భూమిగా పాసుబుక్ సృష్టించాడు. రైతుబంధు (Rythu Bandhu) పథకం డబ్బులు కూడా తీసుకోవడం ప్రారంభించాడు. అక్కడితో ఆగకుండా భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాడు. ఈ 6.14 ఎకరాల పరిధిలోని 88 ప్లాట్లకు చెందిన వారు అభ్యంతరాలు చెప్పారు. లే అవుట్లో వ్యవసాయ భూమి ఎక్కడి నుంచి వచ్చిందని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆ భూమికి రైతుబంధును నిలిపివేశారు. అయితే అడ్డుగోడ మాత్రం తొలగించలేదు. దీంతో బాధితులు 8 ఏళ్లుగా ప్లాట్ల కోసం పోరాడుతున్నారు.
Hydraa | ప్రహరీనీ కూల్చిన హైడ్రా
6.18 ఎకరాల చుట్టూ 2017 -18లో మధుసూధన్ రెడ్డి ప్రహరీ నిర్మించి.. ఎవరినీ లోపలకు అనుమతించడంలేదని భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ (Bhavani Nagar Welfare Association) ప్రతినిధులు హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ ప్లాట్లలోకి వెళ్లడానికి వీలు లేకుండా రహదారులను ప్రహరీతో బ్లాక్ చేశారంటూ వాపోయారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. మొత్తం 27 ఎకరాల పరిధిలో లే అవుట్ ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. ప్రహరీ నిర్మాణానికి ఎలాంటి మున్సిపల్, గ్రామపంచాయతీ అనుమతులు లేవని విచారణలో తేలింది. ప్లాట్లలోకి వెళ్లే రహదారులకు ఆటంకం కలిగించినట్టు అధికారులు గుర్తించారు. శుక్రవారం ఆ ప్రహరీని కూల్చివేశారు. దీంతో ప్లాట్ల యజమానులు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.
