అక్షరటుడే, వెబ్డెస్క్: Registration | ప్రస్తుతం ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్(Sub Registrar) కార్యాలయాలకు వెళ్తే రోజంతా పడిగాపులు కాయాలి. ముఖ్యంగా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రద్దీ అధికంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కో రోజు కార్యాలయాలకు భారీగా ప్రజలు వస్తుండడంతో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అవుతోంది.
ప్రజల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయాలని సంకల్పించింది. అందులో భాగంగా స్లాట్ బుకింగ్(Slot Booking) విధానం అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానం జూన్ 2 (సోమవారం) నుంచి అమలులోకి తీసుకురానుంది.
Registration | అక్కడ విజయవంతం కావడంతో..
ప్రస్తుతం రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయి. మొదట 22 కార్యాలయాల్లో ఏప్రిల్ 10 నుంచి స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశ పెట్టారు. అక్కడ విజయవంతం కావడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకు రానుంది.
Registration | సులభంగా ప్రక్రియ
ఒకే సమయంలో ఎక్కువ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడంతో జరిగే ఆలస్యాన్ని నివారించడానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని (sub registrar office) పనివేళలను 48 స్లాట్లుగా విభజించారు. ప్రజలు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్కు వెళ్లాల్సి ఉంటుంది. తమకు నచ్చిన సమయాన్ని రిజిస్ట్రేషన్ కోసం ఎంపిక చేసుకోవచ్చు. ఆ సమయానికి వస్తే అధికారులు ప్రక్రియ పూర్తి చేస్తారు. కాగా ఇప్పటి వరకు 45,191 డాక్యుమెంట్లు స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు.
Registration | వాట్సాప్లో సేవలు
రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలకు వాట్సాప్లో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏఐ ఆధారిత వాట్సాప్ చాట్బాట్ మేధ ప్రారంభం ప్రారంభించనుంది. రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఏమైనా సందేహాలుంటే వాట్సాప్లోనే నివృత్తి చేసుకోవచ్చు. మరింత వేగవంతంగా, పారదర్శకంగా రిజిస్ట్రేషన్ సేవలే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.