అక్షరటుడే, వెబ్డెస్క్: Tension in Medaram | మేడారం సమ్మక్క–సారలమ్మ (Sammakka-Saralamma) మహాజాతర సందర్భంగా గురువారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో దర్శనానికి సంబంధించిన క్యూలైన్లు ఒక్కసారిగా అదుపుతప్పి తొక్కిసలాట (Stampede)కు దారితీశాయి. క్యూ లైన్లలో అకస్మాత్తుగా తోపులాట జరగడంతో పలువురు మహిళలు, వృద్ధులు కిందపడిపోయారు. కొందరు భక్తులు సొమ్మసిల్లి పడిపోగా, ఈ ఘటనలో మహిళలు, పిల్లలు సహా అనేక మందికి గాయాలయ్యాయి. పలువురికి తలలు పగిలిపోవడం, తీవ్ర గాయాలు కావడం ఆందోళన కలిగించింది.
Tension in Medaram | తొక్కిసలాటలో గాయాలు..
భారీగా భక్తులు (Devotees) తరలిరావడంతో దర్శన క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. వీఐపీ, సాధారణ క్యూ లైన్లతో పాటు ఎగ్జిట్ పాయింట్ల వద్ద కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. వీవీఐపీ పాసులు ఉన్నవారికీ సరైన సౌకర్యాలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సాధారణ భక్తులు కూడా వీవీఐపీ లైన్లలోకి రావడంతో అక్కడ కూడా గందరగోళం నెలకొంది. పరిస్థితిని అదుపు చేయలేని పోలీసులు ఒక దశలో లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. దీంతో మరికొందరికి గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సమ్మక్క గద్దె వద్దకు చేరుకున్న తర్వాత కూడా భక్తుల నియంత్రణలో నిర్లక్ష్యం కనిపించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులు చూసీ చూడనట్టుగా వ్యవహరించడంతో పరిస్థితి మరింత చేదుగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రి సీతక్క (Minister Seethakka)లపై కూడా భక్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జాతర ఏర్పాట్లు వీవీఐపీలకా, రాజకీయ నాయకులకా, లేక సాధారణ భక్తులకా అనే ప్రశ్నలు వినిపించాయి. తమ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు కావడంతో పలు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి.