అక్షరటుడే, వెబ్డెస్క్ : Shreyas Iyer | భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆస్ట్రేలియాతో (Australia) జరిగిన మూడో వన్డేలో క్యాచ్ తీసుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అంతర్గత రక్తస్రావం కారణంగా అతన్ని సిడ్నీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయూలో (ICU) చేర్చగా, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాజాగా అతడి ఆరోగ్యంపై సంతోషకరమైన సమాచారం బయటకొచ్చింది. బీసీసీఐ (BCCI) ప్రకారం, శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపింది. క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం.. అయ్యర్ ఐసీయూ నుంచి బయటకొచ్చాడు.
Shreyas Iyer | శ్రేయస్ సేఫ్..
శ్రేయస్ అయ్యర్కు (Shreyas Iyer) ప్రమాదం లేకపోవడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అయినా కూడా పూర్తిగా కోలుకునేందుకు కొంత సమయం పట్టనుంది. వైద్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి సుమారు రెండు నెలలు పడుతుందని అంచనా. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. డిశ్చార్జ్ అయ్యే వరకు వైద్య బృందం నిరంతరం పర్యవేక్షించనుంది. ఈ నేపథ్యంలో నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు జరగనున్న భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో శ్రేయాస్ పాల్గొనడం అసాధ్యం.
జనవరిలో జరగనున్న భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ నాటికి ఆయన పూర్తిగా కోలుకుని మళ్లీ గ్రౌండ్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో బీసీసీఐ ఆయన తల్లిదండ్రులు సిడ్నీ చేరి కుమారుడిని కలిసేలా ఏర్పాట్లు చేస్తోంది. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా.. ఆస్ట్రేలియా సిరీస్లో శ్రేయాస్ మొదటి మ్యాచ్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచకపోయినా.. రెండో మ్యాచ్లో రోహిత్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన మ్యాచ్లలో ఆసీస్ రెండు గెలిచి సిరీస్ దక్కించుకుంది.
