అక్షరటుడే, వెబ్డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్ (Tollywood)లో షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ ప్రతినిధులు ప్రకటించారు. కార్మికులకు 30శాతం వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. రేపటి నుంచి వేతనాలు పెంచి ఇవ్వాలన్నారు. అలా అయితేనే షూటింగ్లో పాల్గొంటామని స్పష్టం చేశారు.
వేతనాలు (Wages) పెండింగ్ లేకుండా రోజువారీగా ఇవ్వాలని కోరారు. 30శాతం వేతనాలు పెంచి ఇస్తామని ప్రొడ్యూసర్ (Producer) నుంచి లేఖ ఇస్తేనే.. సంబంధిత యూనియన్లకు తెలిపి విధులకు హాజరు కావాలని పేర్కొంది. ఫెడరేషన్లోని 24 కార్మిక సంఘాలు దీనిని పాటించాలని కోరింది. ఇతర భాషా సినిమాలు, వెబ్సిరీస్లకూ ఇది వర్తిస్తుందని తెలిపింది.
ఫెడరేషన్ తరఫున కొంతకాలంగా వేతనాలు పెంచాలని కోరుతున్నారు. అయితే నిర్మాతల కౌన్సిల్ వారి డిమాండ్లను పట్టించుకోలేదు. దీంతో ఫెడరేషన్ ప్రతినిధులు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. షూటింగ్లో పాల్గొనకుండా నిరసన తెలుపుతామని ప్రకటించారు. దీంతో షూటింగ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.