Homeతాజావార్తలుMaoists | మావోయిస్ట్​ పార్టీకి షాక్​.. భారీగా లొంగిపోనున్న నక్సల్స్​

Maoists | మావోయిస్ట్​ పార్టీకి షాక్​.. భారీగా లొంగిపోనున్న నక్సల్స్​

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కీలక నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి సిద్ధం అయ్యారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్ట్​ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కీలక నేత మాడ్వి హిడ్మా (Madvi Hidma) ఇటీవల ఎన్​కౌంటర్​లో మృతి చెందిన విషయం తెలిసిందే. హిడ్మా ఎన్​కౌంటర్తో ఇప్పటికే భారీగా నష్టపోయిన పార్టీకి మరో షాక్​ తగిలింది.

భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోతున్నట్లు సమాచారం.మావోయిస్ట్ కీలక నేతలు తెలంగాణ పోలీసుల (Telangana Police) ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. ఈ మేరకు మధ్యాహ్నం డీజీపీ శివధర్​రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. తాజాగా సరెండర్​ అయిన వారిలో టాప్​ కమాండర్లు ఉన్నట్లు సమాచారం. మొత్తం 37 మంది లొంగిపోయినట్లు తెలిసింది. సరెండర్​ అయిన వారిలో పార్టీ కీలక నేతలు అజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు ఉన్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగిపోవడంతో తెలంగాణలో మావోయిస్ట్​ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

Maoists | ఆపరేషన్​ కగార్​తో..

దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించింది. ఈ మేరకు ఆపరేషన్​ కగార్​ ప్రారంభించింది. దీంతో వేల సంఖ్యలో బలగాలు జల్లెడ పడుతున్నాయి. డ్రోన్​లు, ఆధునిక సాంకేతికత, పక్కా సమాచారంతో బలగాలు కూంబింగ్​ (Coombing) చేపడుతూ మావోయిస్టుల ఆట కట్టిస్తున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్​కౌంటర్లలో వందలాది మంది నక్సల్స్​ మృతి చెందారు. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్​కౌంటర్​ అనంతరం చాలా మంది లొంగుబాట పట్టారు. తాజాగా హిడ్మా, టెక్​ శంకర్​ మృతితో పార్టీ బలహీనంగా మారింది. దీంతో కీలక నేతలు సైతం అడువులను వీడాలని నిర్ణయించుకున్నారు.

Maoists | లొంగు‘బాట’

ఆపరేషన్​ కగార్​ (Operation Kagar)తో భారీ సంఖ్యలో కేడర్​తో పాటు అగ్ర నాయకులు హతం అవుతుండటంతో మావోయిస్టులు ఆయుధాలు వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు లొంగుబాట పట్టారు. ఇప్పటికే చాలా మంది సరెండర్​ అయ్యారు. ముఖ్యంగా అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్​రావు, ఆశన్న తమ అనుచరులతో లొంగిపోయారు. అయితే ఒక్కో రాష్ట్రంలో కొంతమంది మావోయిస్టులు లొంగిపోతుండటం గమనార్హం. మల్లోజుల (Mallojula) మహారాష్ట్ర ప్రభుత్వం ఎదుట సరెండర్​ అయ్యారు. ఆశన్న ఛత్తీస్​గఢ్​లో ఆయుధాలు వీడారు. తాజాగా కీలక నేతలు తెలంగాణలో లొంగిపోనున్నారు. ఇప్పటికే వీరు పోలీసుల ఎదుట లొంగిపోయారని, డీజీపీ మధ్యాహ్నం అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.