అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoists | మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కీలక నేత మాడ్వి హిడ్మా (Madvi Hidma) ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. హిడ్మా ఎన్కౌంటర్తో ఇప్పటికే భారీగా నష్టపోయిన పార్టీకి మరో షాక్ తగిలింది.
భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోతున్నట్లు సమాచారం.మావోయిస్ట్ కీలక నేతలు తెలంగాణ పోలీసుల (Telangana Police) ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. ఈ మేరకు మధ్యాహ్నం డీజీపీ శివధర్రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. తాజాగా సరెండర్ అయిన వారిలో టాప్ కమాండర్లు ఉన్నట్లు సమాచారం. మొత్తం 37 మంది లొంగిపోయినట్లు తెలిసింది. సరెండర్ అయిన వారిలో పార్టీ కీలక నేతలు అజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు ఉన్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగిపోవడంతో తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
Maoists | ఆపరేషన్ కగార్తో..
దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించింది. ఈ మేరకు ఆపరేషన్ కగార్ ప్రారంభించింది. దీంతో వేల సంఖ్యలో బలగాలు జల్లెడ పడుతున్నాయి. డ్రోన్లు, ఆధునిక సాంకేతికత, పక్కా సమాచారంతో బలగాలు కూంబింగ్ (Coombing) చేపడుతూ మావోయిస్టుల ఆట కట్టిస్తున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లలో వందలాది మంది నక్సల్స్ మృతి చెందారు. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అనంతరం చాలా మంది లొంగుబాట పట్టారు. తాజాగా హిడ్మా, టెక్ శంకర్ మృతితో పార్టీ బలహీనంగా మారింది. దీంతో కీలక నేతలు సైతం అడువులను వీడాలని నిర్ణయించుకున్నారు.
Maoists | లొంగు‘బాట’
ఆపరేషన్ కగార్ (Operation Kagar)తో భారీ సంఖ్యలో కేడర్తో పాటు అగ్ర నాయకులు హతం అవుతుండటంతో మావోయిస్టులు ఆయుధాలు వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు లొంగుబాట పట్టారు. ఇప్పటికే చాలా మంది సరెండర్ అయ్యారు. ముఖ్యంగా అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్రావు, ఆశన్న తమ అనుచరులతో లొంగిపోయారు. అయితే ఒక్కో రాష్ట్రంలో కొంతమంది మావోయిస్టులు లొంగిపోతుండటం గమనార్హం. మల్లోజుల (Mallojula) మహారాష్ట్ర ప్రభుత్వం ఎదుట సరెండర్ అయ్యారు. ఆశన్న ఛత్తీస్గఢ్లో ఆయుధాలు వీడారు. తాజాగా కీలక నేతలు తెలంగాణలో లొంగిపోనున్నారు. ఇప్పటికే వీరు పోలీసుల ఎదుట లొంగిపోయారని, డీజీపీ మధ్యాహ్నం అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
