అక్షరటుడే, వెబ్డెస్క్ : Karnataka | వన్యప్రాణి దాడిలో మరణిస్తే ప్రభుత్వం అందించే పరిహారాన్ని పొందాలన్న దురాశతో ఓ మహిళ తన భర్తనే హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా(Mysore District)లో చోటుచేసుకుంది.
నేరాన్ని దాచేందుకు పులి దాడి కథను రచించి అధికారులను తప్పుదోవ పట్టించాలనుకున్న ఆమె ప్రయత్నం చివరకు విఫలమైంది. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు బహిర్గతమయ్యాయి. మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోని చిక్కహెజ్జూరు గ్రామం(Chikkahejjuru Village)కి చెందిన వెంకటస్వామి (54) వ్యవసాయ కూలీ. అతని భార్య పేరు సల్లాపురి.అయితే వెంకటస్వామి, సల్లాపురి దంపతులు పొలాల్లో కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
Karnataka | డబ్బుకోసం..
ఇటీవల గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు పుకార్లు పుట్టాయి. దీనిని అదునుగా మలచుకున్న సల్లాపురి, పరిహారంగా లభించే రూ. 15 లక్షల కోసం తన భర్తను చంపాలన్న కుట్రకు పాల్పడింది. భర్తకు ఆహారంలో విషం కలిపి హత్య చేసింది. అనంతరం ఇంటి వెనుక ఉన్న పేడకుప్పలో శవాన్ని దాచింది. తరువాత పోలీస్ స్టేషన్కి వెళ్లి తన భర్త పులి దాడిలో మిస్సయ్యాడని ఫిర్యాదు చేసింది. సల్లాపురి ఫిర్యాదు మేరకు అటవీ శాఖ అధికారులు(Forest Department Officers), పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.అయితే ఎక్కడ కూడా పులి అడుగుజాడలు కనిపించకపోవడంతో అనుమానం మొదలైంది. అధికారులు ఆమె ఇంటి పరిసరాల్లో గాలింపు జరిపారు.చివరకు పేడకుప్పలో వెంకటస్వామి మృతదేహం బయటపడింది
పట్టుబడిన అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపగా సల్లాపురి, తానే హత్య చేసినట్లు అంగీకరించింది. భర్తను పులి(Tiger) చంపినట్లు నమ్మించేందుకు ప్లాన్ చేశానని తెలిపింది. ఈ విషాద ఘటనపై హుణసూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, ప్రస్తుతం సల్లాపురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. కేసు సంబంధిత మిగతా వివరాలు దర్యాప్తులో తేలనుండగా, గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మనుషులలో మానవత్వం ఎంత తగ్గిపోతుందో, డబ్బు కోసం ఎంతటి దారుణానికి కూడా దిగజారిపోతారో తెలియజేస్తుంది.