అక్షరటుడే, వెబ్డెస్క్ : YS Raja Reddy | దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి(YS Raja Reddy) రాజకీయ రంగ ప్రవేశానికి సన్నద్ధమవుతున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి.
తాజాగా ఆయన చేసిన కర్నూల్ ఉల్లి మార్కెట్(Kurnool Onion Market) పర్యటన ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది. సోమవారం రాజారెడ్డి తన తల్లి షర్మిలతో కలిసి కర్నూల్ ఉల్లి మార్కెట్ను సందర్శించారు. అక్కడ రైతులతో మాట్లాడి, ఉల్లి ధరలు, మార్కెట్ పరిస్థితులు, సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు చేసే విధానం మాదిరిగానే రాజారెడ్డి వ్యవహారశైలి ఉండడం ఇప్పుడు రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చలకు దారి తీసింది.
YS Raja Reddy | నిజమెంత?
పర్యటనకు ముందు వైఎస్ రాజారెడ్డి, ఇంట్లో అమ్మమ్మ అయిన వైఎస్ విజయమ్మ(YS Vijayamma) ఆశీర్వాదం తీసుకోవడం, అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది కేవలం ఒక సాధారణ పర్యటన? లేక ఓ రాజకీయ పయనం ప్రారంభానికి ప్రతీకలా? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, వైఎస్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఉన్న విశేష ప్రజాదరణ, అంతకుమించిన వారసత్వ రాజకీయ నేపథ్యంలో, రాజారెడ్డి రాజకీయాల్లోకి రాక మామూలుగా ఉండదు అంటున్నారు. ఇప్పటికే తల్లి షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న నేపథ్యంలో, ఆయన రాజకీయాల్లోకి అడుగుపెడితే, అది కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి ఉత్సాహం అందిస్తుంది.
ఈ పర్యటనతో పాటు, తల్లితో కలిసి ప్రజల మధ్యకు రావడం, మార్కెట్ వర్గాల్లో రైతులతో మమేకం కావడం ఇవన్నీ ఒక జాగ్రత్తగా రూపుదిద్దుకుంటున్న రాజకీయ ప్లాన్ భాగమై ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం రాజా రెడ్డి సినిమా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడని నెట్టింట జోరుగా చర్చలు నడిచాయి. కానీ ఆ తర్వాత వాటిపైఎలాంటి క్లారిటీ లేదు.