అక్షర టుడే, మెండోరా : Sriram Sagar | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద ఉధృతంగా వస్తోంది. గత వారం రోజులుగా ప్రాజెక్ట్లోకి భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
మహారాష్ట్ర, స్థానికంగా కురిసిన వర్షాలతో గోదావరికి భారీగా వరద(Heavy Flood) వస్తోంది. దీంతో ఎస్సారెస్పీ(SRSP)లోకి ప్రస్తుతం 3.90 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 39 వరద గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 4 వేలు, సరస్వతి కాలువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. మిషన్ భగీరథకు 231, ఆవిరి రూపంలో 600 క్యూసెక్కులు పోతోంది. మొత్తంగా 3,09,231 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతోంది. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ, లక్ష్మి కాలువ, ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలను నిలిపి వేశారు.
Sriram Sagar | 57 టీఎంసీలకు చేరిన నీరు
శ్రీరామ్ సాగర్(Sriram Sagar)లోకి ఎగువ నుంచి భారీగా వరద రావడంతో అధికారులు నిన్నటి వరకు దిగువకు భారీగా నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో కంటే ఔట్ ఫ్లో అధికంగా ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం వేగంగా తగ్గిపోయింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1084.3 (57.6 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. కాగా సోమవారం నుంచి ఔట్ ఫ్లో తగ్గించడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
Sriram Sagar | కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
ప్రాజెక్ట్ దిగువన గల జల విద్యుత్ కేంద్రంలో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. దిగువకు నీటి విడుదల భారీగా ఉండటంతో సామర్థ్యాన్ని మించి ఉత్పత్తి చేస్తున్నారు. నాలుగు టర్బైన్ల ద్వారా నిత్యం 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం అంతకంటే కొంచెం ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి అవుతోందని జెన్ కో అధికారులు తెలిపారు.
Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి
శ్రీరామ్ సాగర్ నుంచి గోదావరిలోకి భారీగా నీటిని వదులుతుండటంతో నది పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదిపై గల వంతెనల వద్ద ఫొటోలు, వీడియోల కోసం వెళ్లొద్దన్నారు. అలాగే రైతులు, మత్స్యకారులు నది సమీపంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.