అక్షరటుడే, వెబ్డెస్క్ : POCSO Court | నల్గొండ (Nalgonda) పోక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఓ మానవ మృగానికి ఏకంగా 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు మంగళవారం న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
దేశంలో బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కొందరు కామాంధులు పిల్లలపై లైంగికదాడికి పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కేసుల విచారణ వేగవంతంగా పూర్తయి నిందితులకు శిక్షలు వేయడానికి ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేసింది. అయినా బాలికలపై నేరాలు ఆగడం లేదు. అయితే పోక్సో (pocso) కేసుల్లో కోర్టులు మాత్రం కఠిన శిక్షలు విధిస్తున్నాయి.
POCSO Court | 24 ఏళ్ల జైలు శిక్ష
నల్గొండ జిల్లాలో మర్రి ఊషయ్య అనే వ్యక్తి 2023 మార్చి 28న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై అప్పుడే పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. రెండేళ్ల విచారణ అనంతరం న్యాయమూర్తి నిందితుడికి 24 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అంతేగాకుండా రూ.40 వేల జరిమానా సైతం విధించారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని పోక్సో కోర్టు ప్రభుత్వానికి సూచించింది.
POCSO Court | మరో కేసులో..
నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సోమవారం సైతం మరో నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2018లో ఎనిమిదేళ్ల బాలికపై రాములు అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ.30 జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం (Compensation) ఇవ్వాలని ఆదేశించింది.