అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు ఏ మాత్రం మారడం లేదు. నిత్యం ఏసీబీ అధికారులు దాడులు (ACB Raids) చేస్తూ.. కేసులు నమోదు చేస్తున్నా లంచాలు తీసుకోవడం మాత్రం మానడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 30 వరకు ఏసీబీ 126 కేసులు నమోదు చేసింది. 125 మంది ప్రభుత్వ ఉద్యోగులను రిమాండ్కు పంపింది. అయినా లంచాలకు మరిగిన అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తమను ఎవరు ఏమీ చేయలేరనే ధీమాతో ప్రజలను లంచాలు అడుతున్నారు. తాజాగా ఓ సీనియర్ అసిస్టెంట్ (Senior Assistant) లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది.
ACB Trap | మ్యుటేషన్ కోసం..
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని జీహెచ్ఎంసీ (GHMC) మూసాపేట సర్కిల్-23 ఆస్తి పన్ను విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ సునీత మ్యుటేషన్ కోసం లంచం డిమాండ్ చేసింది. ఓ వ్యక్తి తన ఆస్తి మ్యుటేషన్ కోసం ఇటీవల కార్యాలయంలో ఆమెను కలిశాడు. ఈ ప్రక్రియ ప్రారంభించి, దస్తావేజు ప్రాసెస్ చేయడానికి రూ.30 వేల లంచం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను (ACB Officials) ఆశ్రయించాడు. ఈ క్రమంలో మంగళవారం రూ.30 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ సునీతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ACB Trap | యథేచ్ఛగా అవినీతి
రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్యాలయాల్లో (Municipal Offices) యథేచ్ఛగా అవినీతి జరుగుతోంది. ఆయా కార్యాలయాల్లో పనులు కావాలంటే చేతులు తడపాల్సిందేననే విషయం బహిరంగ రహస్యం. అన్ని సక్రమంగా ఉన్నా అధికారులకు మాముళ్లు ఇవ్వకపోతే పనులు చేయకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటారు. అదే లంచం ఇస్తే ఏమీ లేకున్నా.. పనులు చేసి పెడతారు.
ACB Trap | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి
ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.