అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad : ఆకాశం వీడిన స్వర్గముర.. ప్రపంచ వింతల నెలవిదిర.. ఇదే భాగ్యనగరముర.. అంటూ ఓ గేయ రచయిత విశ్వనగరం హైదరాబాద్ గురించి గొప్పగా వర్ణించారు. నిజమే.. తెలంగాణ రాజధాని గొప్ప నగరమే. అంతటి మహోన్నత నగరాన్ని సందర్శించేందుకు రాష్ట్ర నలుమూలలతోపాటు దేశంలోని ఆయా రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీనికితోడు ప్రపంచ పర్యాటకుల(Tourists)ను సైతం ఈ మహానగరం ఆకర్షిస్తోంది. ఇటీవలే ప్రపంచ సుందరి (Miss World) పోటీల్లో ప్రపంచ దేశాల నుంచి ఎందరో పర్యాటకులు హైదరాబాద్లో పర్యటించారు.
పర్యాటకులను హైదరాబాద్లో ప్రధాన ఆకర్షించేవి కమ్మని గుమగుమలాడే ఆహార పదార్థాలు. భోజన ప్రియులకు కళ్లకు ఇంపుగా ఉండి నోరూరిస్తుంటాయి. కానీ, ఆ కమ్మని రుచుల వెనుక ఉందంతా విషమేననే విషయం తెలుసా.. భాగ్యనగరాన్ని కల్తీ ఆహార పదార్థాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అడ్డదారిలో అందలం ఎక్కాలనే అక్రమార్కులు ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ.. హైదరాబాద్ వాసుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ (Cyberabad Commissionerate) పరిధిలో జులై 2న ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో దిబ్బతిరిగే విషయాలు వెలుగుచూశాయి. ఎల్బీనగర్ (LB Nagar), మల్కాజ్గిరి (Malkajgiri), మహేశ్వరం (Maheshwaram), భువనగిరి (Bhuvanagiri) ప్రాంతాల్లో భారీగా కల్తీ సరుకులు బయటపడ్డాయి. తనిఖీల్లో పట్టుబడ్డ కల్తీ సరుకులను అధికారులు సీజ్ చేశారు.
Hyderabad : భారీగా కల్తీ నిల్వల సీజ్..
అధికారుల తనిఖీల్లో భారీగా కల్తీ సరుకులు లభించాయి. కల్తీ నెయ్యి ఏకంగా 575 లీటర్లు, 3,037 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ 3,946 కిలోలు, కల్తీ పన్నీర్ 250 కిలోలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కల్తీ ఆహార పదార్థాలకు నకిలీ బ్రాండ్ల స్టిక్కర్లు వేసి, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్న ముఠాను పోలీసుల సాయంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధిక లాభాల ఆశతో.. కల్తీ అని తెలిసినా కొందరు దుకాణదారులు వీటిని ప్రజలకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
Hyderabad : కాదేదీ కల్తీకి అనర్హం..
అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని సింథటిక్ ఫుడ్ కలర్స్తో మిక్స్ చేసి, మార్కెట్లోకి పంపిస్తున్నారు. ఇక, భాగ్యనగరంలో వీటితోపాటు మసాలాలు, కారం, పాలు, టీ పొడి, స్వీట్లు, పసుపు, బిస్కెట్లు, బేకరీ వస్తువులు, ఐస్క్రీమ్లు, మినరల్ వాటర్ కూడా కల్తీకి గురికావడం ఆందోళనకు గురిచేస్తోంది.
Hyderabad : ఏకంగా 52 మంది నిందితుల అరెస్టు..
ఇక అధికారుల తనిఖీలో మరిన్ని అక్రమాలు వెలుగుచూశాయి. హోటళ్లలో నిల్వ ఉంచిన చెడిపోయిన ఆహార పదార్థాలు పట్టుబడ్డాయి. ట్రేడ్ లైసెన్సు, FSSAI లైసెన్సు లేకుండా అమ్మకాలు చేపట్టడాన్ని అధికారులు గుర్తించారు. అశుభ్రత, నకిలీ బ్రాండ్లతో విక్రయాలు చేపడుతున్నట్లు నిర్ధారించారు. దీనికి తోడు చైల్డ్ లేబర్ వినియోగంపై అధికారులు షాక్ అయ్యారు. ఇక కాలం చెల్లిన ముడి పదార్థాల వినియోగం, బ్యాన్ చేయబడిన రంగుల వాడకం ఆందోళనకు గురిచేసే అంశాలు. మొత్తం మీద అధికారులు.. 52 మంది నిందితులను అరెస్టు చేసి, 46 కేసులు నమోదు చేశారు.