అక్షరటుడే, హైదరాబాద్: Haryana Mystery Letter : హరియాణాలోని శివాలయంలో దొరికిన రహస్య లేఖ కలకలం రేపుతోంది. అందులో దేశవ్యాప్తంగా 100 మందిని కిడ్నాప్ చేసి పాకిస్తాన్(Pakistan), దుబాయ్(Dubai)కి అక్రమంగా రవాణా చేసినట్లు రాసి ఉంది. హిస్సార్ రెడ్ స్క్వేర్ మార్కెట్లోని శివాలయం వద్ద ఆలయ పూజారి సురేశ్కు ఈ లేఖ లభించింది. ఆయన వెంటనే దానిని పోలీసులకు చేరవేశారు.
పూజారి(Priest) సురేశ్ శనివారం ఉదయం ఆరు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచారు. అప్పుడు ఆయనకు గోధుమ రంగు కవరులో ఒక లెటర్ కనిపించింది. దానిని తెరిచి చూడగా.. అందులో సంచలన సమాచారం ఉంది. ఆ లేఖపై తెలంగాణ(Telangana)లోని నిజామాబాద్(Nizamabad)కు చెందిన సంపత్ అనే వ్యక్తి చిరునామా ఉండటం గమనార్హం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులోని విషయాలను సునిశితంగా పరిశీలించారు. హిస్సార్, సిర్సా, రేవారి, అంబాలా, గురుగ్రామ్, గంగానగర్, అజ్మీర్, నర్వానా(Hissar, Sirsa, Rewari, Ambala, Gurugram, Ganganagar, Ajmer, Narwana) సహా భారత్లోని వివిధ నగరాల నుంచి 80 – 100 మందిని గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేసి పాకిస్తాన్, దుబాయ్ తీసుకెళ్లి విక్రయించినట్లు ఆ లెటర్లో ఉంది. పోలీసులు ఆ లేఖను ఉన్నతాధికారులకు అందించారు. దీంతో వారు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Haryana Mystery Letter : 2018 నుంచి అక్రమ రవాణా..
తాము 2018 నుంచి ఈ అక్రమ రవాణా కొనసాగిస్తున్నామని, ఫతేహాబాద్కు చెందిన ఒక కుటుంబం తమకు సహాయం చేసేదని లేఖలో సదరు వ్యక్తి వెల్లడించాడు. కానీ, అందులో అతని పేరు మాత్రం రాసింది లేదు. లక్ష్యాలను ఎంచుకుని ప్రేమ, డబ్బు లావాదేవీల ద్వారా మనుషులను వలలో వేసుకునేవారమని తెలిపాడు. హిస్సార్కు చెందిన సుమిత్ గార్గ్, అంబాలా వాసి దిగ్విజయ్, నర్వానాకు చెందిన నవీన్ రోహిలా, ఎల్లనాబాద్కు చెందిన వినోద్ కుమార్, గురుగ్రామ్ వాసి అమర్నాథ్, అమిత్ బాగ్రి, రేవారీకి చెందిన అన్షు గులాటి, అజ్మీర్కు చెందిన అంకిత్ శర్మ, గంగానగర్కు చెందిన రోహిణి, సన్నీ, సిర్సాకు చెందిన అనూజ్, యాజ్పుర్కు చెందిన నరేశ్ను ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేసినట్లు లేఖలో వివరించాడు.
Haryana Mystery Letter : ముఠా నాయకురాలు బెదిరించడంతో..
కిడ్నాప్నకు గురైన వారిలో ఒకరు పాకిస్తాన్ నుంచి పారిపోయారని లేఖలో పేర్కొన్నాడు. పారిపోయిన యువకుడిని పట్టుకుని చంపేయాలని, లేదంటే అతడి కుటుంబం నుంచి మరొక వ్యక్తిని కిడ్నాప్ చేయాలని సదరు ముఠా నాయకురాలు బెదిరిస్తోందని వివరించాడు. అందుకే భయపడి ఈ లేఖ రాస్తున్నానని లేఖలో చెప్పుకొచ్చాడు.
లేఖలో హిస్సార్కు చెందిన సుమిత్ గార్గ్ గురించి ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే కోణంలో దర్యాప్తు చేపట్టగా.. హిస్సార్ లో సుమిత్ అనే పేరుతో ఉన్న నలుగురైదుగురు కనిపించకుండాపోయినట్లు నిర్ధారణ అయింది. వారిలో ఎవరు అక్రమ రవాణాకు గురయ్యారో తెలుసుకునే పనిలో ప్రస్తుతం పోలీసులు నిమగ్నమయ్యారు. దీనికితోడు అక్రమ రవాణాకు సహకరించిన ఫతేహాబాద్(Fatehabad)కు చెందిన కుటుంబం కోసం అన్వేషిస్తున్నారు. దీనికితోడు లేఖలో పేర్కొన్న మిగతా వారి కుటుంబాలను సంప్రదిస్తున్నారు.
Haryana Mystery Letter : కేంద్ర సంస్థలతో సంప్రదింపులు
దుబాయ్, పాకిస్తాన్కు మనుషుల అక్రమ రవాణా జరుగుతోందని ప్రస్తావించడంతో.. అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేపట్టడానికి హరియాణా పోలీసులు కేంద్ర దర్యాప్తు సంస్థలను సంప్రదించారు. మానవ అక్రమ రవాణా లేఖ వైరల్ కావడంతో హిస్సార్, పరిసర ప్రాంత వాసుల్లో భయాందోళన నెలకొంది.
లెటర్ కవర్పై పేరు ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు ఫోరెన్సిక్ విశ్లేషణ కొనసాగుతోందని హిస్సార్ పోలీసు సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావన్ వెల్లడించారు. తాము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలో అందరికీ నిజం తెలుస్తుందన్నారు. పుకార్లను పట్టించుకోవద్దని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.