అక్షరటుడే, వెబ్డెస్క్ : Lalu Prasad Yadav | బీహార్ ఎన్నికల్లో(Bihar Elections) విజయమే లక్ష్యంగా ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాఘటబంధన్ కూటమి ముందుకు సాగుతోంది.
అయితే, సీట్ల పంపకాలకు సంబంధించి చర్చలు ఇంకా పూర్తి కాకముందే అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) సోమవారం అనేక మంది తమ అనుచరులకు టికెట్లు ఇచ్చారు. ఈ పరిణామం కూటమి పార్టీల్లో కలకలం రేపింది. సీట్ల పంపకాలు తేలకముందే పార్టీ టికెట్లు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మరోవైపు, ఐఆర్సీటీసీ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)కు లాలూ హాజరై తిరిగి వచ్చిన అనంతరం సోమవారం పాట్నాలోని మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి నివాసానికి భారీగా అనుచరులు తరలివచ్చారు. పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు అందుకున్న అభ్యర్థులు పార్టీ తమ అనుచరులతో లాలూ ఇంటికి ప్రయాణమయ్యారు. వారికి లాలూ టికెట్లు ఇచ్చారు. అయితే, ఎంతమందికి అధికారికంగా పార్టీ టిక్కెట్లు మంజూరు చేశారనేది ఇంకా లెక్క తేలలేదు.
Lalu Prasad Yadav | జేడీయూ నేతలు ఆర్జేడీ టికెట్లు
ఇటీవల జేడీయూ నుంచి బయటకు వచ్చిన వారికి ఆర్జేడీ టికెట్లు(RJD Tickets) కేటాయించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ నుంచి వైదొలిగిన సునీల్ సింగ్ (పర్బట్టా), గతంలో పలుమార్లు జేడీయూ తరఫున గెలిచిన నరేంద్ర కుమార్ సింగ్ అలియాస్ బోగో తదితరులకు లాలూ సీట్లు కేటాయించారు. భాయ్ వీరేంద్ర, చంద్రశేఖర్ యాదవ్ (మాధేపుర), ఇజ్రాయెల్ మన్సూరి (కాంతి) వంటి ఆర్జేడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు లాలూ ప్రసాద్ యాదవ్ టికెట్లు ఇచ్చారు.
Lalu Prasad Yadav | నోటిఫికేషన్ విడుదల..
మరోవైపు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశకు ఎన్నికల కమిషన్(Election Commission) సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 122 నియోజకవర్గాలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపింది. మొదటి దశకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే, ఇప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ఇంకా ప్రకటించలేదు.