అక్షరటుడే, వెబ్డెస్క్ : Karnataka | వ్యవస్థలో అవినీతి భాగం అయిపోయింది. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే అటెండర్ నుంచి మొదలు పెడితే ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు లంచాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా ఓ రిటైర్డ్ గుమాస్తా (Retired Clerk) ఆస్తులు చూసి అధికారులు షాక్ అయ్యారు. నెలకు రూ.15 వేల జీతంలో పనిచేసిన ఆ ఉద్యోగి ఆస్తులు ఏకంగా రూ.30 కోట్లు ఉండడం గమనార్హం. కర్నాటకలోని (Karnataka) కొప్పల్ జిల్లా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్లో కలకప్ప నిడగుండి అనే వ్యక్తి గుమస్తాగా పని చేశాడు. ఆయన ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు. అయితే లోకాయుక్త అధికారులు తాజాగా ఆయన ఇంట్లో సోదాలు చేపట్టగా కీలక విషయాలు వెలుగు చూశాయి. రూ.15 వేల జీతంతో పని చేసిన గుమాస్తా రూ.30 కోట్ల ఆక్రమాస్తులు కూడ బెట్టినట్లు అధికారులు గుర్తించారు. మాజీ ఇంజినీర్ చిన్చోల్కర్తో కలిసి నిడగుండి అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలు ప్రాజెక్ట్లకు ఫేక్ బిల్లులు, పత్రాలు సృష్టించి రూ.72 కోట్లు కాజేశారని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
Karnataka | 24 ఇళ్లు.. 40 ఎకరాల భూమి
మాజీ గుమాస్తా నిడగుండికి 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి ఉన్నట్లు లోకాయుక్తా అధికారులు (Lokayukta Officers) గుర్తించారు. అంతేగాకుండా ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద కూడా పలు ఆస్తులు ఉన్నాయి. ఆయన ఇంట్లో 1.5 కిలోల వెండి, 350 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా అవినీతి రాజ్యమేలుతోంది. చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి ఐఏఎస్ అధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. భారీగా అక్రమాస్తులు కూడబెడుతున్నారు. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం (Government job) వస్తే తమను ఎవరు ఏమి చేయలేరనే భావనతో అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక గుమస్తా ఏకంగా రూ.30 కోట్ల ఆస్తులు (Rs. 30 Crores Property) కూడబెట్టాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్గా మారింది. గుమాస్తానే రూ.30 కోట్లు సంపాదిస్తే సదరు ఇంజినీర్ ఎంత సంపాదించాడనేది విచారణలో తేలనుంది.