అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Canteen | తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఇందిరమ్మ క్యాంటీన్ పథకం కింద మరో భారీ పౌష్టికాహార కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. నగరంలోని పేదలు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు, బస్తీవాసుల కోసం రూ.5కే నాణ్యమైన టిఫిన్ అందించే స్కీంను GHMC, హరేకృష్ణ ఫౌండేషన్ (Hare Krishna Foundation) సహకారంతో అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రస్తుతం నగరంలోని 60 ఇందిరమ్మ క్యాంటీన్లలో (Indiramma Canteens) ఈ టిఫిన్ పథకం అమలులోకి వచ్చింది. త్వరలోనే ఈ సంఖ్యను GHMC 150 క్యాంటీన్ల వరకు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిరోజూ సుమారు 25,000 మందికి టిఫిన్ అందించేందుకు ప్రణాళిక రూపొందించారు.
Indiramma Canteen | టిఫిన్స్ అందుబాటులోకి..
వారానికి 6 రోజులు టిఫిన్ ఉంటుంది. ఆదివారం సెలవు. మెనూలో మిల్లెట్ టిఫిన్లు (Millet Tiffins) చేర్చారు. ఆరోగ్యమే లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించాం అంటున్నారు. ఈ టిఫిన్ పథకం ప్రత్యేకతగా, మెనూలో ఆరోగ్యకరమైన చిరుధాన్య (మిల్లెట్) టిఫిన్లకు ప్రాధాన్యం ఇచ్చారు. వారంలో రోజుకో కొత్త వెరైటీగా ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీ, పొంగల్ వంటి వంటకాలను అందించనున్నారు. రూ.19 ఖర్చులో, లబ్ధిదారుడి నుంచి కేవలం రూ.5 మాత్రమే అవుతుంది. ఒక్క టిఫిన్ తయారీకి సగటున రూ.19 ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు. కానీ లబ్ధిదారుడు కేవలం రూ.5 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ.14 GHMC సబ్సిడీగా భరిస్తుంది.
ఇంతకుముందు రూ.5 భోజన పథకంలో భాగంగా హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ (హరేకృష్ణ ఫౌండేషన్) తో భాగస్వామ్యంగా పనిచేసిన GHMC, ఇప్పుడు టిఫిన్ పథకంలోనూ అదే భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. ఆహార భద్రత ప్రమాణాలను కట్టుదిట్టంగా పాటిస్తామన్న హామీని అధికారులు ఇచ్చారు.గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్ పథకాన్ని, కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం ఆధునీకరించి, వాటికి ‘ఇందిరమ్మ క్యాంటీన్లు’గా నామకరణం చేసింది. ఇది ఇప్పుడు తెలంగాణ పేదలకు మరొక ఆహార భద్రత వేదికగా మారుతోంది.