HomeతెలంగాణNizamabad KFC | నిజామాబాద్​ కేఎఫ్​సీలో కుల్లిపోయిన చికెన్​.. సిబ్బందితో వినియోగదారుడి వాగ్వాదం!

Nizamabad KFC | నిజామాబాద్​ కేఎఫ్​సీలో కుల్లిపోయిన చికెన్​.. సిబ్బందితో వినియోగదారుడి వాగ్వాదం!

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC : ఇటీవల ఫుడ్​ సెంటర్లు బాగా పాపులర్​ అయ్యాయి. జనాలు ఎగబడి తింటున్నారు. ఆహార ప్రియుల టేస్టులకు అనుగుణంగా కార్పొరేట్​ ఫుడ్​ సెంటర్లు విస్తరిస్తున్నాయి.

నిజామాబాద్​లోనూ అంతర్జాతీయ స్థాయి ఫుడ్​ సెంటర్లు నెలకొల్పబడ్డాయి. దీంతో వీటిలోనూ జనాలు ఎగబడుతున్నారు. నాణ్యత గురించి ఆలోచించకుండా ఆర్డర్​లు పెట్టుకుని లాగించేస్తున్నారు.

అయితే, సంపాదన ఆర్జించడమే ధ్యేయంగా పనిచేసే కార్పొరేట్​, ఇతర ఫుడ్​ సెంటర్లు నాణ్యత పాటించడం లేదు. వినియోగదారులను నిండా మోసగిస్తూ కుళ్లిపోయిన పదార్థాలతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు.

వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పైపై రంగులకు మోజుపడి ఎగబడి తింటూ ఆరోగ్యం గుల్ల చేసుకుంటున్నారు వినియోగదారులు.

తాజాగా నిజామాబాద్​లోని ఓ కార్పొరేట్​ ఫుడ్​ సెంటర్​లో కుళ్లిపోయిన చికెన్​తో పదార్థాలు తయారు చేశారంటూ ఓ వినియోగదారుడు గగ్గోలు పెట్టాడు. సదరు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.

Nizamabad KFC : నగరంలోని వేణుమాల్​లో..

నిజామాబాద్​ నగరంలోని వేణుమాల్​లో ఉన్న కేఎఫ్​సీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

సదరు వీడియోలో ఉన్నదాని ప్రకారం.. కస్టమర్​ చికెన్​ లెగ్​పీస్​లు ఆర్డర్​ పెట్టాడు. కాగా, వేడి వేడిగా వచ్చాయని ఆరగిద్దామని నోట్లో పెట్టుకుంటే కుళ్లిన వాసన రావడాన్ని గుర్తించానని సదరు కస్టమర్​ చెబుతున్నాడు.

ఈ మేరకు కుళ్లిన చికెన్​ ఎలా పెడతారంటూ అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు సదరు వినియోగదారుడు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం గట్టిగానే సాగింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సదరు కస్టమర్​ తీయించినట్లు తెలుస్తోంది. వారే సోషల్​ మీడియాలో పోస్టు చేయడంతో.. నగరంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఇదే హాట్​ టాపిక్​గా మారింది.

దీనిపై ఆహార ప్రియులు మండిపడుతున్నారు. సదరు కార్పొరేట్​ సంస్థపై అధికారులు దాడులు చేపట్టి, నిజనిజాలు నిర్ధారించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.