అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC : ఇటీవల ఫుడ్ సెంటర్లు బాగా పాపులర్ అయ్యాయి. జనాలు ఎగబడి తింటున్నారు. ఆహార ప్రియుల టేస్టులకు అనుగుణంగా కార్పొరేట్ ఫుడ్ సెంటర్లు విస్తరిస్తున్నాయి.
నిజామాబాద్లోనూ అంతర్జాతీయ స్థాయి ఫుడ్ సెంటర్లు నెలకొల్పబడ్డాయి. దీంతో వీటిలోనూ జనాలు ఎగబడుతున్నారు. నాణ్యత గురించి ఆలోచించకుండా ఆర్డర్లు పెట్టుకుని లాగించేస్తున్నారు.
అయితే, సంపాదన ఆర్జించడమే ధ్యేయంగా పనిచేసే కార్పొరేట్, ఇతర ఫుడ్ సెంటర్లు నాణ్యత పాటించడం లేదు. వినియోగదారులను నిండా మోసగిస్తూ కుళ్లిపోయిన పదార్థాలతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు.
వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పైపై రంగులకు మోజుపడి ఎగబడి తింటూ ఆరోగ్యం గుల్ల చేసుకుంటున్నారు వినియోగదారులు.
తాజాగా నిజామాబాద్లోని ఓ కార్పొరేట్ ఫుడ్ సెంటర్లో కుళ్లిపోయిన చికెన్తో పదార్థాలు తయారు చేశారంటూ ఓ వినియోగదారుడు గగ్గోలు పెట్టాడు. సదరు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.
Nizamabad KFC : నగరంలోని వేణుమాల్లో..
నిజామాబాద్ నగరంలోని వేణుమాల్లో ఉన్న కేఎఫ్సీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సదరు వీడియోలో ఉన్నదాని ప్రకారం.. కస్టమర్ చికెన్ లెగ్పీస్లు ఆర్డర్ పెట్టాడు. కాగా, వేడి వేడిగా వచ్చాయని ఆరగిద్దామని నోట్లో పెట్టుకుంటే కుళ్లిన వాసన రావడాన్ని గుర్తించానని సదరు కస్టమర్ చెబుతున్నాడు.
ఈ మేరకు కుళ్లిన చికెన్ ఎలా పెడతారంటూ అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు సదరు వినియోగదారుడు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం గట్టిగానే సాగింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సదరు కస్టమర్ తీయించినట్లు తెలుస్తోంది. వారే సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. నగరంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఇదే హాట్ టాపిక్గా మారింది.
దీనిపై ఆహార ప్రియులు మండిపడుతున్నారు. సదరు కార్పొరేట్ సంస్థపై అధికారులు దాడులు చేపట్టి, నిజనిజాలు నిర్ధారించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.