అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | ఓట్ల కోసం ఇష్టారీతిన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్ (CM Revanth Reddy) వ్యవసాయాన్ని భ్రష్టు పట్టిస్తోందని, ఉద్దేశ పూర్వకంగానే యూరియా(Urea) కొరత సృష్టించి అన్నదాత మెడకు ఉరి బిగించిందన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు ఎరువుల కోసం క్యూలు కడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ఎరువుల కొరతతో సగానికి సగం పంటల దిగుబడి తగ్గుతుందని రైతుల గగ్గోలు పెడుతున్నారని, ఎరువులు ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్ రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్ (KCR) హయాంలో ఎరువుల దుకాణాల వద్ద ఎప్పుడైనా పోలీసులు కనిపించారా అని ప్రశ్నించారు.
Ex Mla Jeevan Reddy | ఎరువుల కొరత తెలంగాణలోనే..
యూరియా కొరత దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, కేవలం తెలంగాణలోనే (Telanagana) ఎందుకు వస్తోందని ఆయన ప్రశ్నించారు. నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాని దన్నారు. కేసీఆర్ హయాంలో యూరియా కొరత లేదని, రైతులకు సకాలంలో సరిపడా యూరియా అందించామని ఆయన గుర్తు చేశారు. వాళ్ల పార్టీ మంత్రులే యూరియా లేదంటుంటే, రేవంత్ మాత్రం సరిపడా ఉందని అబద్ధం చెపుతున్నారని ఆయన విమర్శించారు. రోజుల తరబడి క్యూలో నిలబడ్డ రైతులు, మహిళలు కడుపుమండి బూతులు తిడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వినబడట్లేదా అని ద్వజమెత్తారు.
కేసీఆర్, కేటీఆర్ను తిట్టుడు తప్ప కాంగ్రెస్కు వేరే పనే లేదన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎట్లుంది? నేడు ఎట్లుంది? అని ఆయన ప్రశ్నించారు. స్వర్ణయుగం పోయి మళ్లీ రాతియుగం వచ్చిందని జీవన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రైతుల పక్షాన ఎంతకైనా తెగిస్తామని జీవన్ రెడ్డి అన్నారు.