అక్షరటుడే, వెబ్డెస్క్ : Revanth Reddy warning officials | రోడ్లు శుభ్రంగా లేకపోతే సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు. సచివాలయంలో మంగళవారం ఆయన పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి (MAUD)పై అధికారులతో సమీక్షించారు.
నగరం అంతటా, ముఖ్యంగా ప్రధాన జంక్షన్లలో స్మార్ట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో PPP మోడల్ కింద స్కైవాక్ వంతెనల నిర్మాణానికి పరిశీలించాలన్నారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో బహుళ-స్థాయి కార్ పార్కింగ్ సకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Revanth Reddy warning officials | హోర్డింగ్లపై..
ప్రకటన బోర్డుల ఏర్పాటులో కఠినమైన నిఘా అవసరమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదాయం ప్రభావితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకటన బోర్డులలో పది శాతం ప్రభుత్వ కార్యక్రమాలకు కేటాయించాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఒకసారి ప్రకటన బోర్డు రుసుములు వసూలు చేయాలన్నారు. అనధికార హోర్డింగ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వీధిలైట్ల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏకీకృత వ్యవస్థను అమలు చేయాలన్నారు. GHMC ప్రతిపాదిత విభాగం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించాలని సీఎం సూచించారు. జీహెచ్ఎంసీని ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ కార్పొరేషన్లలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. త్వరలో ప్రతి జోన్లో వ్యక్తిగతంగా పర్యటిస్తానని ఆయన చెప్పారు. రోడ్లు అపరిశుభ్రంగా ఉంటే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయాన్నే రంగంలోకి దిగాలని ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఆయన సూచించారు.