అక్షరటుడే, వెబ్డెస్క్:Cyber Crime | సైబర్ నేరగాళ్లు రోజురోజుకి తెగిస్తున్నారు. రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేస్తున్నారు. కేసుల పేరిట ప్రజలను భయపెడుతూ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. మొన్నటి వరకు పోలీసుల పేరుతో భయపెట్టిన నేరగాళ్లు తాజాగా సుప్రీంకోర్టు జడ్జి (Supreme Court Judge) పేరు చెప్పి రిటైర్డ్ ఉద్యోగికి టోకరా వేశారు.
హైదరాబాద్(Hyderabad)లోని వనస్థలిపురంలో నివసించే రిటైర్డ్ ఇంజినీర్(Retired engineer)కు ఇటీవల సైబర్ నేరస్తులు ఫోన్ చేశారు. ఆయనపై కేసు నమోదు అయిందని భయపెట్టారు. వీడియో కాల్ చేసి సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడుతున్నట్లు నమ్మించారు. కేసు కొట్టివేయడానికి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇందుకోసం ఏకంగా నకిలీ కోర్టు సృష్టించి, నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి వీడియో కాల్లో మాట్లాడించారు. దీంతో భయపడిన సదరు విశ్రాంత ఇంజినీర్ నిందితులు చెప్పిన ఖాతాల్లోకి రూ.1.5 కోట్లు బదిలీ చేశాడు. అనంతరం తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను (Rachakonda Cyber Crime Police) సంప్రదించాడు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Cyber Crime | అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా ఫోన్ చేసి తాము పోలీసులం, జడ్జిలమని చెప్పి బెదిరిస్తే భయపడకుండా ఉండాలని చెబుతున్నారు. పోలీసులు, జడ్జీలు ఎవరు కూడా వీడియో కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయరని తెలిపారు. ఎవరైనా అలా ఫోన్ చేస్తే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి ఫోన్ చేయాలని కోరారు.