అక్షరటుడే, కామారెడ్డి: Arogyasri | పదేళ్లుగా ఆరోగ్యశ్రీలో విధులు నిర్వర్తిస్తున్న తమను విధుల నుంచి తొలగించడం అన్యాయమని ఆరోగ్యశ్రీ ఆపరేటర్లు ఆందోళన నిర్వహించారు. కామారెడ్డి జీజీహెచ్ (Kamareddy GGH) వద్ద శనివారం నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆపరేటర్లు మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ తప్ప ఇతర పనులు చేయవద్దని ఉన్నప్పటికీ కరోనా లాంటి సమయంలో మాస్కులు, పీపీఈ కిట్స్ లేకున్నా పనిచేశామన్నారు. అలాంటి తమను అకారణంగా విధుల నుంచి తొలగించడం సరికాదన్నారు. గతంలో ఉన్న ఆస్పత్రి సూపరింటెండెంట్లు తమను తొలగించకుండా సహకరిస్తూ వచ్చారన్నారు.
కొత్తగా వచ్చిన సూపరింటెండెంట్ మాత్రం నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమస్యపై ఎవరికి ఫిర్యాదు చేసినానన్నెవరు ఏమి చేయరని సూపరింటెండెంట్ అంటున్నారని ఆరోపించారు. అన్నింటికీ తెగించే కామారెడ్డికి వచ్చాను అన్నట్టుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ చికిత్సకు రూ. 10 లక్షలు ఇస్తున్నా ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద చేరిన రోగుల వద్ద ఇంప్లాంట్స్ కోసమని రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు. జీతాలు ఇవ్వలేమన్న కారణంతో తమను తొలగించడం సరికాదని, తమకు జరిగిన అన్యాయానికి తాము ఉన్నతాధికారులను కలుస్తామని, అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆపరేటర్లు సాయికుమార్, నర్సింలు, హరికుమార్, స్వరూప, ఆనంద్ పాల్గొన్నారు.