HomeతెలంగాణBandi Sanjay | కేంద్ర మంత్రి బండి సంజయ్​కు హైకోర్టులో ఊరట

Bandi Sanjay | కేంద్ర మంత్రి బండి సంజయ్​కు హైకోర్టులో ఊరట

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​కు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఆయనపై నమోదైన పేపర్​ లీకేజీ కోసును కోర్టు కొట్టేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​కు హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. బీఆర్​ఎస్ (BRS)​ హయాంలో ఆయనపై నమోదైన కేసును కోర్టు తాజాగా కొట్టివేసింది.

బండి సంజయ్​ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీలో ఆయన ప్రమేయం ఉందని కేసు నమోదైంది. కరీంనగర్​ (Karimnagar) జిల్లా కమలాపూర్​ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. 2023 ఏప్రిల్​లో ఆయనను పోలీసులు అరెస్ట్​ చేశారు. అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్​ బీఆర్​ఎస్​పై దూకుడుగా ఉండటంతో అక్రమ కేసులు పెట్టారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు పలు ఠాణాలకు తిప్పారు. అయితే ఈ కేసును గురువారం హైకోర్టు కొట్టివేసింది.

రాజకీయ కక్షలతో ఈ కేసు నమోదు చేశారని కేంద్ర మంత్రి సంజయ్​ తరఫు న్యాయవాదులు వాదించారు. కేసు నమోదులో సరైన సెక్షన్లు లేవని, దర్యాప్తులో పూర్తి వివరాలు సేకరించలేదని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు కోర్టు కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్‌ ఉల్లంఘించారని కేటీఆర్‌ (KTR), గోరటి వెంకన్నపై కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గోరటి వెంకన్న అప్పుడు కేటీఆర్​ను సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల జ్యోతి వద్ద ఇంటర్వ్యూ చేశారు. అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగురవేశారని, బీఆర్​ఎస్​కు లబ్ధి చేకూర్చే విధంగా ఇంటర్వ్యూ ఉందని పోలీసులు కేసు పెట్టారు. రాజకీయ లబ్ధి కోసమే కేసు పెట్టారని కేటీఆర్‌ తరఫు న్యాయవాది వాదించారు. దీంతో హైకోర్టు కేటీఆర్‌, గోరటి వెంకన్నపై కేసును కొట్టివేసింది.

Bandi Sanjay | సత్యమేవ జయతే

తనపై కేసును కోర్టు కొట్టివేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ స్పందించారు. సత్యమేవ జయతే అని ఎక్స్​ వేదికగా పోస్ట్​ చేశారు. అప్పటి BRS ప్రభుత్వం తనపై దాఖలు చేసిన కల్పిత పదో తరగతి పేపర్ లీక్ కేసును హైకోర్టు కొట్టివేసిందన్నారు. BJP నోరు మూయించడానికి బీఆర్​ఎస్​ అధికార దుర్వినియోగానికి పాల్పడి తనపై కేసు నమోదు చేసిందన్నారు. తనకు దానితో సంబంధం లేదని వారికి తెలుసని, అయినప్పటికీ పోలీసులను ఆయుధంగా చేసుకుని కేసు పెట్టారని పేర్కొన్నారు.