అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad | నిజామాబాద్ జిల్లాలో నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు జరిపిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న అసైన్డ్ భూములకు (Assigned lands) ఏకంగా డాక్యుమెంట్లు సృష్టించారు. ఆన్లైన్లో నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ.. సబ్ రిజిస్ట్రార్లు అవేమీ లెక్కచేయకుండా అడ్డదారిలో రిజిస్ట్రేషన్లు చేసి పెట్టడం గమనార్హం.
నిజామాబాద్ రూరల్ కార్యాలయం (nizamabad rural registration office) పరిధిలో గతంలో జరిగిన పలు అక్రమ డాక్యుమెంట్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సారంగపూర్ శివారులోని సర్వే నం.83లో అసైన్డ్ భూమి ఉంది. కాగా.. ఈ భూమి ధరణి (ప్రస్తుతం భూమాత పోర్టల్), రిజిస్ట్రేషన్ల శాఖ ఆన్లైన్లో నిషేధిత జాబితాలో ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి లావాదేవీ చేసేందుకు వీలుండదు. అటు రెవెన్యూ అధికారులు గానీ, సబ్ రిజిస్ట్రార్లు గానీ లావాదేవీలు జరిపేందుకు ఎలాంటి అధికారం ఉండదు. అయినా నిజామాబాద్ రూరల్ కార్యాలయం పరిధిలో అసైన్డ్ భూమికి సంబంధించిన పలు డాక్యుమెంట్లు జరపడం చర్చకు దారి తీసింది.
సర్వే నం.83 భూమి విషయమై ఓ సామాజిక కార్యకర్త తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా.. అసైన్డ్భూమి అని బయటపడింది. కాగా.. ఈ సర్వే నంబర్లోని ఓ డాక్యుమెంట్లో 22 గుంటలకు సంబంధించిన అసైన్డ్ భూమిని సబ్ రిజిస్ట్రార్లు దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్లు చేసిపెట్టడం గమనార్హం.
Nizamabad | తప్పుడు నాలా పత్రాలతో..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) హయాంలో ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఆ తర్వాత ధరణి ద్వారానే భూమి తాలూకా నాలా సర్టిఫికెట్లను ఆన్లైన్లో జారీ చేశారు. అయితే తాజాగా వెలుగుచూసిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి.. తప్పుడు నాలా పత్రాలను సమర్పించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అసైన్డ్భూములకు నాలా జారీ చేయరు. నిషేధిత జాబితాలో ఉన్నందున వీటికి నాలా సర్టిఫికెట్ ఇచ్చే అధికారం ఎవరికీ ఉండదు.
అయితే 2020లో నిజామాబాద్ ఆర్డీవో నాలా సర్టిఫికెట్ జారీ చేసినట్లు పత్రాలు సృష్టించడం విచిత్రం. ఇవేమీ పరిశీలించకుండానే సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు జరపడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి ఓ జూనియర్ అసిస్టెంట్ ఈ డాక్యుమెంట్లను చక్కబెట్టినట్లు తెలుస్తోంది.